కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉండాలి: సల్మాన్ ఖుర్షిద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీనే తమ నాయకుడని, ఆయన మళ్లీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై సల్మాన్ ఖుర్షిద్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయ వ్యూహాల గురించి, వ్యక్తిగత గౌరవం గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్లను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. తన ఓటెప్పుడూ గాంధీ కుటుంబీకులకేనని, భారత చరిత్ర, ప్రజాస్వామ్యాల గురించి వాళ్లకంటే ఎక్కువగా ఎవరికీ తెలిసి ఉండదని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
యుద్ధంలో ప్రత్యర్థిపై పోరాడాలంటే ముందు మనవైపు అన్నీ సమపాళ్లలో ఉండాలని, సరైన నాయకత్వం, వ్యూహాలు, ప్రతివ్యూహాలను పసిగట్టగలిగే సత్తా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆ సత్తా రాహుల్ గాంధీకే ఉందని, అందుకే ఆయన్ను తాను నమ్ముతానని చెప్పుకొచ్చారు సల్మాన్ ఖుర్షిద్.
అందుకే రాహుల్ గాంధీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని, ఇక సోనియా గాంధీ తమలో స్ఫూర్తి నింపుతూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీపై సల్మాన్ ఖుర్షిద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైఫల్యాలను గుర్తించడంలో జాప్యం కారణంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
అంతేగాక, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణాలు కూడా ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేకపోయామని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఆగస్టులో నియమించుకున్నామని, ఆ తర్వాత పూర్తిస్థాయి అధ్యక్ష పదవి కోసం ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని సల్మాన్ ఖుర్షిద్ వాపోయారు. ఇక తమ నాయకుడు రాహుల్ గాంధీ వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారని, ఆయనే అధ్యక్షుడిగానే ఉండాల్సిందన్నారు.
సరైన నాయకుడు లేకపోవడమే తమ పార్టీకి పెను సమస్యలా మారిందని సల్మాన్ ఖుర్షిద్ ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ బాధ్యతలు తీసుకున్నా.. ఆమె తనని తాను తాత్కాలిక అధ్యక్షురాలిగానే భావిస్తున్నారని, ఇలాగైతే రానున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో చాలా కష్టతరంగా మారుతోందని సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యానించారు.