శభాష్ నేత్ర: రూ.5 లక్షల సాయంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, అంబాసిడర్గా నియామకం...
ఇదీ కలికాలం. మంచి లేదు, మానవత్వం లేనేలేదు. తోటి మనిషికి కష్టం వచ్చిన పట్టించుకున్న నాథుడే లేడు. కానీ ఓ బాలికది గొప్ప మనస్సు. చదువుకునే వయస్సులోనే ఉదారత చాటింది. తన చదువు కోసం తండ్రి కూడబెట్టిన రూ. లక్షలను ఆకలి కేకలతో అలమటిస్తోన్న వలస కూలీల కోసం వెచ్చించింది. ఆమెపై ఇప్పటికే ప్రధాని మోడీ పొగడ్తల వర్షం కురిపించగా.. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు కురిపించింది.
చదువు కోసం రూ.5 లక్షలు
మధురైకి చెందిన సీ మోహన్ సెలూన్ ఓనర్. క్షవరం, గడ్డం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఇతనికి భార్య, నేత్ర అనే కూతురు ఉంది. కూతురు చదువు కోసం రూ. 5 లక్షలను మోహన్ కూడబెట్టాడు. అయితే కరోనా వైరస్ వల్ల కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో వలసకూలీల ఆకలి కేకలతో పట్టణాలు మిన్నంటాయి. నిత్యం వార్తలు, దినపత్రికల్లో కూలీల కష్టం చూసిన.. నేత్ర తన చదువు కోసం దాచిన రూ.5 లక్షలను పేదల కోసం వెచ్చించాలని ఆలోచించింది. ఇందుకోసం తన తండ్రిని మెప్పించి, ఒప్పించింది.
శభాష్ నేత్ర
నేత్ర చేసిన మంచిపనిని పలువురు కొనియాడారు. ప్రధాని మోడీ కూడా ప్రశంసించారు. మధురై పట్టణానికే నేత్ర గర్వకారణం అని పేర్కొన్నారు. ఆమె తండ్రి మోహన్ గురించి కూడా మన్ కీ బాత్తో ప్రస్తావించారు. ఇలా ఉండగా నేత్ర చేసిన మంచి పని ఖండంతరాలు దాటింది. ఆమె ఉదారత, దాతృత్వంపై పొగడ్తలతో ముంచెత్తింది. ఆమె చేసిన మంచికి గాను.. పేదల కోసం గూడ్ విల్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ పీస్ (యూఎన్ఏడీఏపీ) పేర్కొన్నది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో న్యూయార్క్, జెనీవాలో మాట్లాడే అవకాశం కల్పిస్తానని ప్రకటించింది.
Recommended Video
జయలలిత అవార్డు...?
నేత్ర చేసిన ఉదార సాయంపై తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు కూడా అభినందించారు. జయలలిత పేరుతో అవార్డు ఇప్పిస్తామని.. ఇందుకోసం ముఖ్యమంత్రి పళనిస్వామితో కలిసి మాట్లాడుతానని పేర్కొన్నారు. తన చదువు కోసం దాచిన రూ.5 లక్షలను వెచ్చించిన నేత్ర.. మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోంది.