నో అంటే రాజీనామే, మీ వెంట మేం: కావూరితో నేతలు
న్యూఢిల్లీ: మంత్రివర్గ సమావేశంలో సమైక్యవాదం బలంగా వినిపించాలని, కాదంటే రాయల తెలంగాణ డిమాండ్ చేయాలని, అధిష్టానం దానికి ఒప్పుకోకుంటే రాజీనామా చేయాలని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావుకు సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు సూచించినట్లుగా సమాచారం. కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు కేబినెట్ సమావేశానికి ముందు భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో పలు అంశాలు వారు చర్చించారు. కేబినెట్ సమావేశంలో సమైక్యాంధ్రను బలంగా వినిపించాలని సూచించారు. లేదంటే రాయల తెలంగాణ కోరాలని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డిలు సూచించారు.
రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని ఎక్కువ మంది సూచించారు. సమైక్య గళమే వినిపించాలన్నారు. లేదంటే అందరం మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధంగా ఉందామని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీలో అనుకూలం లేకుంటే రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించాలని కోరారు. అప్పుడు మీ వెంటే మేము ఉంటామని తెలిపారని తెలుస్తోంది.
కాగా, తెలంగాణ విభజనను మరోకేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ స్వాగతిస్తున్న విషయం తెలిసిందే. ఆయన విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన వీరికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు సీమాంధ్రలో కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద భద్రత పెంచినట్లుగా తెలుస్తోంది.
వెంకయ్య నో
కేంద్రమంత్రి జైరామ్ రమేష్ పార్లమెంటు హాలులో బిజెపి నేత వెంకయ్య నాయుడును కలిసి రాయల తెలంగాణ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. తమ పార్టీ పది జిల్లాల తెలంగాణకు కట్టుబడి ఉందని, దానిపై తాము వెనక్కి తగ్గమని వెంకయ్య చెప్పినట్లుగా తెలుస్తోంది.