పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన: సైకిలెక్కిన మాజీ ముఖ్యమంత్రి..!
లక్నో: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు (ఎనఆర్సీ), జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా సమాజ్ వాది పార్టీ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తోంది. ఇన్నిరోజులుగా ఉత్తర ప్రదేశ్ లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, ఆందోళనకు భిన్నంగా శాంతియుత ప్రదర్శనలకు తెర తీసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సైకిల్ ర్యాలీని నిర్వహించింది.
సమాజ్ వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంగళవారం ఉదయం రాజధాని లక్నోలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అసెంబ్లీ భవనం దాకా ఈ ర్యాలీని చేపట్టారు. అఖిలేష్ యాదవ్ కూడా సైకిల్ పైనే అసెంబ్లీ భవనానికి చేరుకున్నారు. అసెంబ్లీ ఆవరణలోనే నిరసన ప్రదర్శనలను చేపట్టారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు, జాతీయ జనాభా నమోదు కార్యక్రమాలను అమలు చేయడానికి ఆసక్తి లేవని అఖిలేష్ యాదవ్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే వైఖరితో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వాటిని నిర్బంధంగా అమలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. నిరంకుశ పాలనను కేంద్ర ప్రభుత్వం గుర్తుకు తెస్తోందని విమర్శించారు.
नहीं चाहिए NRC-NPR,
— Akhilesh Yadav (@yadavakhilesh) December 31, 2019
हमें चाहिए रोज़गार। pic.twitter.com/R12QKIqDb2
దేశాన్ని ముస్లిం రహితంగా మార్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇందులో భాగంగానే- ఈ కార్యక్రమాలను బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తోందని మండి పడ్డారు. ఉత్తర ప్రదేశ్ లో ఆందోళనల్లో పాల్గొన్న కారణంగా పేద కుటుంబీకులకు కూడా ఆస్తులను జప్తు చేయడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోటీసులు జారీ చేశారని, ఇదొక ఆటవిక చర్యగా అభివర్ణించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.