మహారాష్ట్ర నుంచే బీజేపీ పతనం: కూటమికి సమాజ్ వాది పార్టీ బేషరతు మద్దతు
ముంబై: మహారాష్ట్రలో ప్రజాస్వామ్య బద్ధంగా అధికారాన్ని అందుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమికి అనూహ్య మద్దతు లభించింది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యాన్ని వహిస్తోన్న సమాజ్ వాది పార్టీ శివసేన కూటమికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. మద్దతు ఇస్తోన్న విషయాన్ని లిఖిత పూరకంగా తెలియజేసింది. ఈ మేరకు ఓ అధికారిక పత్రాన్ని కూటమి నాయకులకు అందజేసింది.
ముఖం పగిలే సమాధానం: మా బలాన్ని చూశారుగా.. రాజీనామా చేయండి: ఫడ్నవీస్ కు కాంగ్రెస్ డిమాండ్
సోమవారం సాయంత్రం ముంబైలోని గ్రాండ్ హయత్ లో ఏర్పాటైన శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ శాసన సభ్యుల పరేడ్ కు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ హాజరయ్యారు. ఆయన వస్తారని ఎవరూ ఊహించలేదని ఈ సందర్భంగా కూటమి నాయకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే- శివసేన ఉన్న కూటమిని సమర్థించంటూ ఇదివరకే అఖిలేష్ యాదవ్ వెల్లడించిన విషయం తెలసిందే.
పరేడ్ నేపథ్యంలో.. అనుకోని అతిథిగా అబు అజ్మీ హాజరయ్యారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నాయకులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా గుర్తించారు. శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, మల్లికార్జున ఖర్గే సరసన ఆయనకు కుర్చీని ఏర్పాటు చేయడం.. అబు అజ్మీకి ఇస్తోన్న ప్రాధాన్యతకు అద్దం పట్టింది. కూటమి ఎమ్మెల్యేల పరేడ్ ముగిసిన అనంతరం అబు అజ్మీ విలేకరులతో మాట్లాడారు.
బేషరతుగా తమ పార్టీ కూటమికి మద్దతు ఇస్తోందని ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా, సామర్థ్యం, సంఖ్యాబలం కూటమికి ఉందని, త్వరలోనే తాము మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పతనాన్ని చూస్తామని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా అధికారాన్ని అందుకోవడానికి కూటమి నాయకులు కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. వారి పోరాటాన్ని తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశంసించారని, అందుకే- బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారని చెప్పారు.
మహారాష్ట్ర నుంచే బీజేపీ పతనం ఆరంభమౌతుందని అబు అజ్మీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పాతిపెట్టి, అప్రజాస్వామ్యంగా, రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ నాయకులు అధికారాన్ని అందుకున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. గవర్నర్ వ్యవస్థలను కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలచుకోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. బీజేపీ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అబు అజ్మీ పిలుపునిచ్చారు.