హత్యే కేసులో దోషిగా తేలిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు
జలాన్: ఉత్తరప్రదేశ్లోని చర్ఖారి ఎమ్మెల్యే కప్తాన్ సింగ్ రాజ్పుత్పై అనర్హత వేటు పడనుంది. గత పదమూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఓ హత్య కేసులో సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కప్తాన్ సింగ్, ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్ దోషులుగా అక్కడి స్ధానిక న్యాయస్ధానం నిర్ధారించింది.
శనివారం రాత్రి వారిద్దరని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రత్యేక న్యాయమూర్తి (వ్యతిరేక దోపిడీ) సంజయ్ కుమార్ శనివారం కప్తాన్ సింగ్, ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్ దోషులుగా నిర్ధారించాడు. శిక్షకు సంబంధించిన పూర్తి వివరాలను న్యాయస్ధానం సోమవారం వెల్లడించనుంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాసిక్యూషన్ వారి ప్రకారం, కిషన్ అనబడే వ్యక్తి ఏప్రిల్ 20, 2002న కప్తాన్ సింగ్, అతని సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేసిన దాడిలో చంపబడ్డాడని పేర్కొన్నారు.
ఈ దాడిలో కప్తాన్ సింగ్, అతని సోదరుడు లక్ష్మణ్ సింగ్తో పాటు మరో తొమ్మిది మంది పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ కేసుల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీ న్యాయస్ధానం ద్వారా దోషులుగా నిర్ణయించబడి రెండు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ రోజులు జైలు పాలైతే వారిని అనర్హులుగా ప్రకటించాలని భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.