ములాయం సింగ్ కు ఏమైంది? అత్యవసర చికిత్స విభాగంలో చేరిన మాజీ ముఖ్యమంత్రి
లక్నో: సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కు తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో ములాయంకు చికిత్స అందిస్తున్నారు. ములాయం ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. అత్యవసర చికిత్స విభాగానికి తరలించిన వెంటనే డాక్టర్లు ఆయన తలకు ఎలెక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్ తీశారు. నివేదికలను చూసిన తరువాత భయపడాల్సిన పనేమీ లేదని తెలిపారు. సాయంత్రంలోగా డిశ్చార్జి చేస్తామని అన్నారు. దీనితో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
బీజేపీలోకి బల్లే బల్లే: లోక్ సభ టికెట్ ఖాయమేనా?
గ్యాస్ట్రో, న్యూరో సంబంధ సమస్యలతో ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉత్తర్ ప్రదేశ్ లోని మైన్ పురి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కొద్దిరోజుల కిందటే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారని, ఫలితంగా అనారోగ్యానికి గురై ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు ఇవే చివరి ఎన్నికలని ములాయం ప్రచారం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేస్తున్నారు. చివరి ఎన్నికలను తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నానని, గెలిపించాలని కోరుతూ ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ వాది పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోవడానికి ఈ మహాకూటమి వ్యూహాలు పన్నుతోంది. ఆయా పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం ఏడు దశల్లో ఉత్తర్ ప్రదేశ్ లో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తయింది.