తోటి కోడలు కోసం డింపుల్ పాట్లు: పెద్దాయనా అదే...
ఉత్తరప్రదేశ్ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ లోక్ సభ సభ్యురాలు డింపుల్ యాదవ్.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్తతోపాటు ప్రచార బాధ్యతల్లో తల మునకలవుతున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ లోక్ సభ సభ్యురాలు డింపుల్ యాదవ్.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్తతోపాటు ప్రచార బాధ్యతల్లో తల మునకలవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ఆ పార్టీలో నాయకత్వ పాత్రపై వచ్చిన సంక్షోభంలో భర్త అఖిలేశ్, మామ ములాయం సింగ్ యాదవ్ మధ్య విభేదాలు పెరుగకుండా.. కుటుంబ ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన డింపుల్ యాదవ్ ఇప్పుడే అదే బాట పట్టారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఆమె తోటి కోడలు, ములాయం రెండో భార్య సాధనాగుప్తా కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ తమ కుటుంబంలో విభేదాలు లేవని నిరూపించేందుకు ప్రయత్నించారు.
ఎన్నికల ప్రచారంలో డింపుల్, అపర్ణ ఇద్దరూ కలసి ఒకే వేదికను పంచుకున్నారు. తోడికోడలు అపర్ణకు మద్దతుగా డింపుల్ ప్రచారం నిర్వహించారు. లక్నో కంటోన్మెంట్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో డింపుల్, అపర్ణ పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా డింపుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. అపర్ణకు ఓట్లు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు.
డింపుల్ యాదవ్ ఇలా..
రాష్ట్ర ప్రగతికి ఎస్పీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు చేపట్టిందని డింపుల్ యాదవ్ వివరించారు. లక్నో - ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభంతో రెండు నగరాల మధ్య దూరం తగ్గిందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రగతికి చిహ్నం అని, మరింత అభివ్రుద్ధి సాధించేందుకు ఎస్పీకే మద్దతునివ్వాలని అభ్యర్థించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల నినాదాల మధ్యే ‘నేతాజీ' దీవెనలతోనే రెండేళ్లలోనే లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయిందని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ మెట్రో రైలులో ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రయాణించవచ్చునన్నారు. పలు అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్లే రాజకీయ ప్రత్యర్తుల్లో రక్తపోటు పెరిగి పోతుందన్నారు.
నోట్ల రద్దుతో తీవ్ర ప్రభావం
కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేయడంతో ప్రజలంతా బ్యాంకుల ముందు బారులు తీరాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. నోట్ల రద్దు కారణంగా చిన్న వ్యాపారులు, కూలీల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని డింపుల్ యాదవ్ చెప్పారు. మాయావతి హయాంలో సాధించిందేమిటన్నప్పుడు సభకు హాజరైన వారంతా ఏనుగు, ఏనుగు అని నినదించారు. మాయావతి ప్రభుత్వం పలుచోట్ల ఏనుగు విగ్రహాల నిర్మాణం చేపట్టి విమర్శల పాలయింది. కాగా పలు రంగాల్లో సాధించిన ప్రగతిని చూడకుండా బీజేపీ కేవలం రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్నే లేవనెత్తుతున్నదన్నారు. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో శాంతిభద్రతల అంశాన్ని లేవనెత్తాలని కేంద్రమంత్రి ఉమాభారతికి డింపుల్ యాదవ్ సూచించారు. గుజరాత్ లోని కచ్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితుడు బీజేపీ కార్యకర్తేనని వార్తలొస్తున్నాయని గుర్తు చేశారు.
అపర్ణా యాదవ్.. ఇదే తొలిసారి...
ప్రతీక్ యాదవ్ భార్య అయిన అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. సమాజ్వాదీ పార్టీ ఇంతవరకు ఎప్పుడూ నెగ్గని లక్నో కంటోన్మెంట్ స్థానాన్ని ఆమె ఎంచుకున్నారు. తమ ఇద్దరి వ్యక్తిత్వాలు వేరయినా డింపుల్, తాను చాలా సన్నిహితంగా ఉంటామని అపర్ణ చెప్పారు. ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ వెలుగులోకి వచ్చారు. ములాయం సోదరుడు శివ్పాల్ యాదవ్ గ్రూపు నాయకురాలిగా పేరొందిన అపర్ణాయాదవ్ పార్టీ పగ్గాలు తన ఆధీనంలోకి తీసుకోవాలని భావించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. పార్టీ పగ్గాలను అఖిలేశ్ యాదవ్ చేజిక్కించుకున్న తర్వాత ఓ దశలో ఆయన ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణకు, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ములాయం కుటుంబంలో ఆధిపత్య పోరు, ఎస్పీలో చోటు చేసుకున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కినా.. ఎన్నికలు వచ్చేసరికి తమ మధ్య విభేదాలు లేవని, అందరూ కలసికట్టుగా ఉన్నామని ములాయం కుటుంబ సభ్యులు చెప్పుకోవడం ఆసక్తి కర పరిణామం.
కోడలికి ములాయం ప్రచారం
అంతకుముందు తన కోడలు అపర్ణా యాదవ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ములాయం సింగ్ యాదవ్ తమ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా లక్నో కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అపర్ణ పూర్తిచేస్తుందన్నారు. ఒకవేళ అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వమే కొలువుదీరితే మరింత మెరుగైన అభివ్రుద్ది సాధ్యమన్నారు. తన కోడల్ని గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు రుణ పడి ఉంటానన్నారు. ఎస్పీ తరపున ములాయం పాల్గొన్న మూడో ప్రచార సభ ఇది. ఇంతకుముందు తన సోదరుడు శివ్ పాల్ యాదవ్ కోసం రెండు ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాగా, అపర్ణా యాదవ్ ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రీటా బహుగుణ జోషి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలో చేరారు. దీంతో రీటా బహుగుణ పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయని సమాచారం.