కరోనా : భారత్,సౌతాఫ్రికాల్లో ఏక కాలంలో లాక్ డౌన్.. కానీ అక్కడికీ ఇక్కడకీ ఎంత తేడా..?
భారత్లో కరోనా వైరస్ కేసులకు బ్రేక్ పడట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపుగా 20వేల కేసులకు ఇప్పుడు చేరువవుతోంది. చాలా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పుకుంటున్నాం. భారత్ తీసుకుంటున్న నియంత్రణ చర్యలను డబ్ల్యూహెచ్ఓ సైతం ప్రశంసించడంతో ఊరట చెందాం. కానీ భారత లెక్కలకు క్షేత్ర స్థాయి పరిస్థితులకు లెక్క తప్పుతోందా అన్న సందేహాలు కూడా లేకపోలేదు. టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే సమయంలో మనతో పాటే లాక్ డౌన్ను విధించుకున్న సౌతాఫ్రికా లాంటి దేశాల్లో కేసుల సంఖ్య మనకంటే తక్కువగా ఉండటం కూడా ఆలోచించాల్సిన విషయం.
సౌదీలో కరోనా కాటుకు బలైన 8 మంది భారతీయులు వీళ్లే.. తెలంగాణ నుంచి ఒకరు..
లాక్ డౌన్ ముందు.. తర్వాత...
సామాజికంగా,రాజకీయంగా,ఆర్థికంగా,జనాభా పరంగా సౌతాఫ్రికాకు భారత్కు చాలా వ్యత్యాసం ఉంది. రెండు దేశాలను ఒకే గాటున కట్టి చూడలేం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొన్ని వాస్తవాలను మాత్రం గమనించాల్సిన అవసరం ఉంది. భారత్లో జనవరి 30న మొదటి కరోనా వైరస్ నమోదు కాగా.. 54 రోజుల తర్వాత మార్చి 24న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించారు. సౌతాఫ్రికాలో మార్చి 5న మొదటి కరోనా వైరస్ కేసు నమోదు కాగా.. 21 రోజుల తర్వాత మార్చి 26న అధ్యక్షడు సిరిల్ రమఫోసా దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య లాక్ డౌన్ తేడా కేవలం రెండు రోజులు కాగా.. కేసుల సంఖ్యలో మాత్రం భారీ తేడా ఉంది. ఇప్పటివరకూ భారత్లో 17,615 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 559 మంది మృత్యువాత పడ్డారు. అదే సౌతాఫ్రికాలో కేవలం 3158 కేసులు నమోదవగా.. కేవలం 54 మంది మృత్యువాతపడ్డారు. సౌతాఫ్రికాతో పోలిస్తే భారత్లో కొత్త కేసుల సంఖ్య దాదాపు 6 రెట్లు ఎక్కువగా ఉంది.
లాక్ డౌన్ తర్వాత కొత్త కేసుల సంఖ్య ఎలా ఉంది..
జనాభాపరంగా భారత్,సౌతాఫ్రికాల మధ్య భారీ తేడా ఉంది. కాబట్టి ఇరు దేశాల కేసుల సంఖ్యను పోల్చి చూడలేం. అయితే లాక్ డౌన్ నిబంధనలను సౌతాఫ్రికా అమలుచేసిన విధానం నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశీలకులు. భారత్లో లాక్ డౌన్ విధించే నాటికి దేశవ్యాప్తంగా 536 కేసులు,18 మరణాలు నమోదయ్యాయి. సౌతాఫ్రికాలో లాక్ డౌన్ విధించే నాటికే 926 కేసులు నమోదయ్యాయి. అయితే ఒక్క మృతి కేసు కూడా నమోదవలేదు. భారత్లో లాక్ డౌన్ విధించిన నెల రోజుల తర్వాత దేశంలో 17,079 కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ సౌతాఫ్రికాలో కేవలం 2231 కేసులు నమోదయ్యాయి. టెస్టింగ్ డేటా ప్రకారం.. భారత్లో ప్రతీరోజూ దాదాపు 500 కొత్త కేసులు నమోదవుతుండగా సౌతాఫ్రికాలో సగటున రోజుకు 150 కొత్త కేసులు నమోదవుతున్నాయి.సౌతాఫ్రికాలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు 243 కాగా.. భారత్లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు 1553.
భారత్ కంటే వేగంగా స్పందించిన సౌతాఫ్రికా
భారత్లో లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా వైద్య పరీక్షల సంఖ్య నెమ్మదిగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో విదేశీ ట్రావెల్ హిస్టరీ లేకుండా కరోనా లక్షణాలున్న వారికి టెస్టులు చేయడం ఏప్రిల్ 9వ తేదీ నుంచి మొదలైంది. అంటే,దేశంలో మొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన 70 రోజులకు,లాక్ డౌన్ విధించిన 15 రోజులకు గానీ ఈ టెస్టులు ప్రారంభం కాలేదు. సౌతాఫ్రికా మాత్రం టెస్టుల విషయంలో మనకంటే చాలా దూకుడుగా,అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మొత్తం జనాభా అంతటిని జల్లెడ పట్టి టెస్టులు చేసే కార్యక్రమాన్ని చేపడుతోంది. లాక్ డౌన్ విధించిన 15వ రోజు నాటికి అక్కడ 64వేల టెస్టులు నిర్వహించారు. ఇందులో ఎక్కువ భాగం ప్రైవేట్ సెక్టార్ ద్వారా నిర్వహించినవే. ఫిబ్రవరి 7వ తేదీ నాటికి సౌతాఫ్రికాలో ఇంకా ఒక్క కేసు కూడా నమోదు కాకముందే అక్కడి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సంస్థ అప్పటికే 42 టెస్టులు నిర్వహించింది. అవన్నీ నెగటివ్గానే తేలాయి. ఫిబ్రవరి మధ్య నాటికి.. అప్పటికీ ఇంకా ఒక్క కేసు కూడా నమోదు కాకముందే.. అన్ని ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఉచిత టెస్టులను ప్రకటించింది.
ఇరు దేశాల్లో జరుగుతున్న టెస్టులు.. సౌతాఫ్రికా తీసుకున్న చర్యలు..
వైరస్ దేశంలో ప్రవేశించిన 50 రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 20 నాటికి సౌతాఫ్రికా మొత్తం 1,14,000 టెస్టులను నిర్వహించింది. అంటే ఒక మిలియన్ జనాభాకు 1934 టెస్టులు నిర్వహించింది. ఇక భారత్ ఇప్పటివరకు 4లక్షల టెస్టులు నిర్వహించింది. చూసేందుకు ఇది పెద్ద నంబరే అయినా.. ఒక మిలియన్ జనాభాకు ఇక్కడ జరిగిన టెస్టులు మాత్రం కేవలం 291 మాత్రమే. దేశంలో వైరస్ ప్రవేశించిన 80 రోజుల తర్వాత జరిగిన టెస్టులు వివరాలు ఇవి. సౌతాఫ్రికాలో మార్చి 26న లాక్ డౌన్ విధించిన రోజే అధ్యక్షుడు సిరిల్ రమఫోసా జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు. మొదటి కేసు నమోదైన 13 రోజులకే అన్ని విద్యా సంస్థలను మూసివేయించారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు,పార్లమెంటరీ సెషన్స్ రద్దయ్యాయి. దేశంలో పానిక్ బయింగ్(భయాందోళనతో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయడం) పెరగడంతో.. వస్తువుల కొనుగోలుకు పరిమితి విధించారు.ధరలు పెంచేసి అమ్ముతున్నవారిని జైలుకు పంపించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీ జరిమానా విధించారు. లాక్ డౌన్ ప్రకటించిన ఏడు రోజులకే.. నిబంధనల ఉల్లంఘన కింద దాదాపు 2200 మందిని అరెస్ట్ చేశారు. నిబంధనలు బేఖాతరు చేసినందుకు ఏకంగా ఓ మంత్రిని సైతం 2 నెలలు లీవ్పై పంపించేశారు.
Recommended Video