ఆగని సమీర్ వాంఖడే దుమారం-ఆర్యన్ కేసు నుంచి ఉద్వాసన-నమాజ్ చేస్తాడన్న మాజీ మామగారు..
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే.. అంతే వేగంగా విమర్శల ఊబిలో కూరుకుపోయారు. ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆయన దూకుడుగా తీసుకున్న నిర్ణయాలతో అసలు డ్రగ్స్ కేసు కంటే సమీర్ వాంఖడే వార్తల్లో నిలవడంతో ఆయనపై ఎన్సీబీ వేటు వేసింది. ఆర్యన్ ఖాన్ కేసులో ఆయన ఇకపై దర్యాప్తు అధికారిగా ఉండబోరని ప్రకటించింది. అదే సమయంలో సమీర్ మాజీ భార్య తండ్రి ఆయనపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
సమీర్ వాంఖడే దుమారం
ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరు పార్టీ చేసుకుంటుండగా.. డ్రగ్స్ సేవించారంటూ వారిని అరెస్టు చేసిన సమీర్ వాంఖడే.. ఆ తర్వాత దర్యాప్తులో వీరిపై బెయిల్ కు కూడా వీల్లేని కేసులు పెట్టారు. ఓ రకంగా చెప్పాలంటే డ్రగ్స్ కేసులో నిందితులుగా దొరికిన వారిని చట్టానికి అప్పజెప్పి, నేర నిరూపణ చేసి శిక్ష పడేలా చూడాల్సిన అధికారి కాస్తా వారిని వేధిస్తూ వార్తల్లో నిలిచారు.
ఇలా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే చూపిన దూకుడుతో ఇప్పుడు ఆయనకు వారం రోజుల్లో రావాల్సిన బెయిల్ కాస్తా నెల రోజులైనా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో సమీర్ తీరుపై మొత్తం బాలీవుడ్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విరుచుకుపడుతోంది.
నవాబ్ మాలిక్ తో సై అంటే సై
ఆర్యన్ ఖాన్ కేసులో సమీర్ వాంఖడే దూకుడును తప్పుబడుతూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ విమర్శలు చేయడం మొదలుపెట్టగానే ఆయన ఎదురుదాడికి దిగారు. నవాబ్ మాలిక్ వ్యాఖ్యల్ని సైతం డ్రగ్స్ కేసులోకి లాగేశారు. దర్యాప్తు అధికారిని టార్గెట్ చేశారంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో నవాబ్ మాలిక్ మరింత రెచ్చిపోయారు.
ఆయన ముస్లిం బ్యాక్ గ్రౌండ్ పై విమర్శలు మొదలుపెట్టారు. సర్టిఫికెట్లు ఫోర్జరీ చేసి మరీ ఉద్యోగం సంపాదించారని ఆరోపణలు చేశారు. ఈ రెండు అంశాలపై వివరణ ఇచ్చుకోవడం సమీర్ వాంఖడేకు కష్టంగా మారిపోయింది. నవాబ్ రోజుకో కొత్త ఆరోపణ చేస్తుండటం, వీటి వెనుక మహారాష్ట్ర ప్రభుత్వం ఉండటంతో వాటిపై పోరాటం చేయడంలో సమీర్ విఫలమయ్యారు.
బాలీవుడ్, మహా సర్కార్ టార్గెట్
ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తులో సమీర్ వాంఖడే దూకుడుగా వ్యవహిరించి ఆయనకు బెయిల్ దక్కకుండా చేస్తున్నారనే ఆగ్రహం అటు బాలీవుడ్ తో పాటు ఇటు మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ పెరుగుతూ వచ్చింది. బాలీవుడ్ ప్రముఖుల్ని టార్గెట్ చేయడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే సమయంలో ముంద్రా పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే చర్యలు తీసుకోకుండా ఆర్యన్ ఖాన్ కేసులో సెలబ్రిటీల్ని అరెస్టు చేయడం, వారికి బెయిల్ రాకుండా చేయడమేంటని స్వయంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ధాక్రే ప్రశ్నించారు. దీంతో సహజంగానే ఎన్సీబీపై ఒత్తిడి పెరుగుతూ పోయింది. చివరికి అదే సమీర్ కు శాపంగా మారిపోయింది.
ఆర్యన్ కేసు నుంచి సమీర్ కు ఉద్వాసన
ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తులో భాగంగా వివాదాలు కొనితెచ్చుకుంటూ అసలు కేసు కంటే తనపై వచ్చిన ఆరోపణలు పరిష్కరించుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్ధితికి వచ్చిన సమీర్ వాంఖడే తీరుపై ఎన్సీబీ తీవ్ర అసంతృప్తిగా ఉంది. అదే సమయంలో ముంబై పోలీసులు సమీర్ వాంఖడేపై దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండటంతో ఎన్సీబీ ఆయనకు ఉద్వాసన పలుకుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ ఖాన్ కేసులో సమీర్ వాంఖడే దర్యాప్తు అధికారి కాదని ఇవాళ ఎన్సీబీ డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో సమీర్ పర్యవేక్షణ అధికారిగా మాత్రమే ఉన్నారని సింగ్ వెల్లడించారు. ఆయనపై డీడీజీ, డీజీ ఉన్నారని గుర్తు చేశారు. ఈ కేసులో వీవీ సింగ్ దర్యాప్తు అధికారి అని స్పష్టం చేశారు.
సమీర్ వాంఖడే నమాజ్ చేస్తాడన్న మాజీ మామగారు..
ఇప్పటికే వరుస షాకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖడేపై అతని మాజీ భార్య షబానా ఖురేషీ తండ్రి డాక్టర్ జాయెద్ ఖురేషీ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేసారు. సమీర్ అన్ని ముస్లిం ఆచారాల్ని పాటిస్తాడని తెలిపారు. ఆయన నమాజ్ కూడా చేస్తాడన్నారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు కూడా చేస్తాడన్నారు. తన కుమార్తెను ఓ ముస్లిం కుటుంబానికే ఇచ్చామని, వారు అన్ని ముస్లిం ఆచారాల్ని పాటిస్తారని జాయెద్ వెల్లడించారు. ఎంగేజ్ మెంట్ అయిన పది నెలల తర్వాత వీరిద్దరికీ పెళ్లి చేశామని, దావూద్ వాంఖడే ముస్లిం సంప్రదాయంలో వీరి పెళ్లి జరిపించారని జాయెద్ వెల్లడించారు.