కరోనా హెల్ప్ లైన్ కి సమోసా ఆర్డర్ .. సమోసా ఇచ్చి సఫాయి పని చేయించిన అధికారులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక ప్రజలను కేవలం నిత్యావసరాల కోసమే బయటకు అనుమతిస్తున్నాయి. కొన్ని చోట్ల కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటె అక్కడ ప్రజలకు తామే కావలసిన నిత్యావసరాలు తెచ్చి ఇస్తామని చెప్తున్నాయి. ఇక ప్రజల కోసం హెల్ప్లైన్లు ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నాయి . అయితే కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. కరోనా హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఏది పడితే అది చెప్తున్నారు.
అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో చోటుచేసుకుంది. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్కు రాంపూర్కు చెందిన ఓ వ్యక్తి పదేపదే ఫోన్ చేసి నాలుగు సమోసాలు తెమ్మని ఆర్డర్ చేశారు.
ఇది అత్యవసరాలకు ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ అని చెప్పినప్పటికీ సదరు వ్యక్తి సమోసాలు కావాలని డిమాండ్ చేశాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అతడికి సమోసాలు అందజేయడమే కాకుండా తమ విధులకు ఆటంకం కలిగించినందుకు అక్కడి మరుగుదొడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేయాలనే సామాజిక శిక్ష విధించినట్లు కలెక్టర్ తెలిపారు.
అంతే కాక కలెక్టర్ దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసాడు. ఇలాంటి కీలక సమయంలో ప్రజల కోసం తగిన సేవలు అందించడానికి ఉన్న తమ అమూల్యమైన సమయాన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోన్ కాల్స్ తో వృధా చేస్తే ఫలితం ఇలానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో దేశం విలవిలలాడుతుంటే సమోసాల కోసం డిమాండ్ చేసిన వ్యక్తికి సఫాయి పని అప్పగించి అధికారులు మంచి పనే చేశారని ఈ విషయం తెలిసిన వారంతా చెప్పుకుంటున్నారు.