మోదీ జీ! టాటా నానో కారుకు భూరీ రుణం సరే: పేదల సంగతేమిటి?
సనంద్: గుజరాత్ మోడల్ పేరిట 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చేపట్టిన ప్రచారంతో చాంపియన్గా అవతరించింది. 'సనంద్' ప్రగతి కూడా ఈ దఫా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సవాల్ ఎదుర్కోనున్నది. ఎనిమిదేళ్ల క్రితం 'టాటా నానో' కారు పశ్చిమబెంగాల్ రాష్ట్రం సింగూర్ నుంచి గుజరాత్లోని సనంద్ జిల్లాకు తరలొచ్చింది. ఈ దఫా నానో ఫ్యాక్టరీ కూడా ఎన్నికల్లో ప్రచారాస్త్రమైంది. 2009లో గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ 'టాటా మోటార్స్' ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'నానో కారు' ప్రాజెక్టు చేపట్టేందుకు ఆ సంస్థకు 1,100 ఎకరాల భూమి కేటాయించారు.
నాటి టాటా గ్రూప్ సంస్థల అధినేత రతన్ టాటా కేవలం 350 ఎకరాల భూమి కేటాయిస్తే చాలునని కూడా అన్నారు. కానీ 1,100 ఎకరాల భూమితోపాటు వడ్డీ లేకుండా రూ.9,000 కోట్ల రుణం కూడా ఇచ్చారని గుజరాత్ కాంగ్రెస్ పీసీసీ ప్రధాన కార్యదర్శి పంకజ్ సింగ్ గుర్తు చేశారు. టాటామోటార్స్ యాజమాన్యానికి, గుజరాత్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వడ్డీలేని రుణంతోపాటు 22 ఏళ్ల తర్వాత రుణం తిరిగి చెల్లింపు మొదలవుతుందన్నది నిబంధన.
ఇలా చీకట్లోనే మగ్గుతున్న గ్రామాలు
టాటా గ్రూపు సంస్థతో గుజరాత్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం, వడ్డీ లేని రుణం ప్రభుత్వం మంజూరు చేయడంతో తమకు సమస్య లేదని ‘టాటా నానో' గ్రూపు సంస్థ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు తమకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించడం లేదని విమర్శలు గుప్పించారు. ‘నానో సిటీలో ఆధునిక కార్లు ఉత్పత్తి కావచ్చు. కానీ నార్త్ కొత్పూరా గ్రామం చీకట్లో మగ్గుతున్నది' అని గ్రామ మాజీ సర్పంచ్ ఘన్శ్యామ్ సింగ్ వాఘేలా ఆవేదన వ్యక్తం చేశారు.100 ఏళ్లకు పైగా నార్త కొత్పూరా గ్రామం ప్రపంచ చిత్రపటంలో ఉన్నది, కానీ నానో ఫ్యాక్టరీ అన్ని రకాల వసతులు కల్పించిన సర్కార్ తమకు కనీసం తాగునీటి వసతి కల్పించలేకపోయిందన్నారు. ‘మా ముందు ఉన్న అతిపెద్ద సమస్య తాగునీటి వసతి. ఇప్పటికి తాగునీటి కోసం కిలోమీటర్ దూరం నడువాల్సి వస్తుంది' స్థానిక వాసి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మూడు తరాలకు నార్త్ కొత్పూరా గ్రామం నెలవుగా నిలిచింది. ‘నేను నా జీవితం అంతా ఇక్కడే జీవించా. నేను ఇక్కడ నుంచి ఇతర చోటికి ఎలా వెళ్లాలి? ఇప్పుడంతా మెరుగైన జీవితం కోసం చాలా మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు' అని అంటున్నారు.
1858 నుంచి గల పాఠశాలలో 25 మంది విద్యార్థులే
దశాబ్దాలుగా భారత రాజకీయ నాయకులు ప్రతిసారీ విద్యుత్, తాగునీరు తదితర సమస్యలపైనే ప్రధానంగా ద్రుష్టి కేంద్రీకరిస్తామని చెప్తారే తప్ప. ప్రధాన సమస్యలు పట్టించుకోవడం లేదు. పలు గ్రామాలు మౌలిక వసతులకు దూరంగా ఉన్నాయి. ‘తాగునీరు లేదు. విద్యుత్ లేదు. ప్రతి ఒక్కరూ ఎలా మనుగడ సాగించేది? ఇదేనా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటిత అభివ్రుద్ధి మోడల్?' అని యువకులు ప్రశ్నిస్తున్నారు. నానో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల వాసుల పిల్లలకు విద్యాబుద్దులు చెప్పించేందుకు సరైన వసతుల్లేక పోవడంతో ఇది ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మారింది. 1858 నుంచి పని చేస్తున్న ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికి 25 మంది విద్యార్థులు మాత్రమే చదువుతుండటం గమనార్హం. పద్మాజీ పటేల్ 17 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు. ఇది చాలా పాత స్కూల్ అని, నానో ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత చాలామంది గ్రామస్తులు ఇక్కడ నుంచి వెళ్లిపోయారని, దీన్ని కూడా తొలగించాలని భావించినా విద్యార్థులు చదువుతుండటంతో ఆగిపోయారని అంటున్నారు. మరో టీచర్ అహ్మదాబాద్ నుంచి వచ్చి పాఠాలు చెప్పి వెళ్తుంటారని స్థానికులు తెలిపారు.
నర్మదా నీటి కోసం ఎదురుచూపులు
నానో ఫ్యాక్టరీ పక్కనే ఉన్న ఛారోడీ గ్రామ వాసులు తమకు ఆరోగ్య పరిరక్షణ, విద్యా వసతులు లేవని ఆవేదన తెలిపారు. అంతేకాదు నర్మదా నదీ జలాలు తమ పొలాలకు మళ్లించాలని రైతులు కోరుతున్నారు. రెండు దశాబ్దాలుగా నర్మదా ప్రాజెక్టు పనులు సాగుతున్నా కెనాల్ ద్వారా నీరు మాత్రం సరఫరా చేయలేదని ఆరోపిస్తున్నారు. నీటి కొరతతో తాము పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. పలు జంతువులు మరణిస్తున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారానికి మూడుసార్లు తాగునీరు సరఫరా చేస్తున్నారని అంటున్నారు. కారు ఫ్యాక్టరీలో పని దొరికినా అంత సజావుగా సాగలేదని తెలిపారు. ‘నా కొడుకు ఒక రైతు కానీ నానో ఫ్యాక్టరీ కోసం భూమి తీసేసుకున్నారు. ఇప్పుడు అదే ఫ్యాక్టరీలో తోటమాలిగా పని చేస్తున్నాడు' అని ఒక రైతు తల్లి వాపోయారు. తమకు సాదాసీదా ఉద్యోగాలు వద్దని, కనీసం రూ.7000 నుంచి రూ.10 వేల విలువైన ఉద్యోగాలు కావాలని ఖోడా గ్రామ వాసి అన్నారు. నానో ప్లాంట్ వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించామని, కానీ ఎనిమిదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదని మరో రైతులు చెప్పారు.
మేకిన్ ఇండియా లక్ష్యాలు ఎక్కడన్న రాహుల్
దేశవ్యాప్తంగా అతి తక్కువ నిరుద్యోగిత కల రాష్ట్రాల్లో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. సగటున మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ తర్వాతీ స్థానాల్లో గుజరాత్ ఉంది. ఉద్యోగాల కల్పనలోనే గుజరాత్ పరిస్థితి ఆత్మనూన్యతా భావంతోనే కొట్టుమిట్టాడుతోంది. సనంద్ పట్టణంలోని ప్రతి ఇద్దరిలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. నానో కారు ప్రాజెక్టు ఏర్పాటుతో తలెత్తిన సమస్యలే ప్రధానంగా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర ప్రభుత్వం పేద ‘టాటా' గ్రూపుకు 0.01 శాతంపై వడ్డీ ఇచ్చింది. కానీ రైతులకు పంట రుణాల కోసం 18 శాతం వడ్డీపైనే రుణాలిస్తున్నది' అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జెవాలా ఆరోపించారు. టాటా నానో కారు విక్రయాలు పడిపోవడంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మక పథకం ‘మేకిన్ ఇండియా'పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మరోవైపు గుజరాత్ రాష్ట్ర ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షలు, ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కోసం పాటిదార్ల ఆందోళన వంటి సామాజిక అనిశ్చితి కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలపై టాటామోటార్స్ వివరణ ఇచ్చింది. తమకు కేవలం రూ.584.8 కోట్లు రుణం మాత్రమే తీసుకున్నామని, నిధి కాదని పేర్కొన్నది. దానికి తాము పన్ను చెల్లిస్తున్నామని స్పష్టం చేసింది. గుజరాత్ రాష్ట్ర ప్రగతి కోసం ఆర్థిక కార్యకలాపాలు చేపట్టామని తెలిపింది. సనంద్లో నానో ఫ్యాక్టరీ కోసం స్థలం కేటాయించడంలో ఎటువంటి వివాదం కూడా లేదని బీజేపీ నేత, ఆ పార్టీ గుజరాత్ ఇన్చార్జి భూపీందర్ యాదవ్ తెలిపారు.