Drugs case:వివేక్ ఓబెరాయ్ ఇంట్లో పోలీసుల సోదాలు.. ఎందుకంటే..?
గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న డ్రగ్స్ వ్యవహారం మళ్లీ వార్తల్లో నిలిచింది. బెంగళూరు నుంచి ముంబైకి ఈ డ్రగ్స్ వ్యవహారం కనెక్ట్ అయ్యింది. తాజాగా బెంగళూరు పోలీసులు ముంబైకి వెళ్లారు. అక్కడ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తన బావమరిది ఆదిత్య అల్వాపై డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో విచారణలో భాగంగా బెంగళూరు పోలీసులు వివేక్ ఒబెరాయ్ ఇంటిని సోదా చేసినట్లు సమాచారం.
బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అక్టోబర్ 20 వరకు మళ్లీ రియా రిమాండ్ పొడిగింపు..ఎన్సీబీ వాదన ఇలా !!
ప్రస్తుతం ఆదిత్య అల్వా పరారీలో ఉన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. వివేక్ ఒబెరాయ్ బంధువు ఆదిత్య అల్వా కాబట్టి తను వివేక్ ఇంట్లో తలదాచుకుంటున్నాడన్న సమాచారం రావడంతో సెర్చ్ చేసేందుకు వచ్చామని పోలీసులు వెల్లడించారు. కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్తో ముంబైకి చేరుకున్న బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఆదిత్య అల్వా కర్నాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు. శాండల్వుడ్ డ్రగ్ కేసులో ఆదిత్య పేరు కూడా బయటకొచ్చింది.
పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ప్రారంభించిన నాటి నుంచే ఆదిత్య కనిపించడం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీలోని పలువురు నటులకు, సింగర్లకు ఆదిత్య డ్రగ్స్ సరఫరా చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ అమ్మకాలు, రేవ్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంతో ముడిపడి ఉన్న నటి రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు రేవ్ పార్టీ నిర్వాహకుడైన వీరేన్ ఖన్నా, రియల్టర్ రాహుల్ థాన్సేలు కూడా ఉన్నారు.
బెంగళూరులోని హెబ్బాల్ లేక్ సమీపంలో ఉన్న ఐదెకరాల స్థలంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ ప్రాపర్టీ ఆదిత్య అల్వా తల్లి నందిని అల్వా పేరుతో ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పార్టీల్లోనే డ్రగ్స్ తీసుకోవడం జరిగిందనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం పై వార్తలు వస్తున్న సమయంలోనే బెంగళూరు డ్రగ్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుగుతున్న సమయంలో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది.