సుశాంత్ మృతికి దుబాయ్ లింకులు... విష ప్రయోగం...? ఆ నిర్మాతపై అనుమానాలు...
అనేక అనుమానాలు,చిక్కుముళ్లు,మలుపులు... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుశాంత్ మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. 'సుశాంత్ హంతకుల రాక్షస మనస్తత్వం,వారి ప్రమేయం నెమ్మదిగా బయపడుతుంది. సుశాంత్ కడుపులో ఉన్న విషపు ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకే పోస్టుమార్టమ్ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు.' అని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. అంతేకాదు,సుశాంత్ సన్నిహితుడు,సినీ నిర్మాత సందీప్ సింగ్పై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
Recommended Video
సందీప్ సింగ్... దుబాయ్ లింకులు...?
సందీప్ సింగ్ దుబాయ్కి ఎన్నిసార్లు వెళ్లాడు... ఎందుకు వెళ్లాడన్నది ప్రశ్నించాలని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో సందీప్ సింగ్పై అనుమానాలు హాట్ టాపిక్గా మారాయి. ఇదే నేపథ్యంలో టైమ్స్ నౌ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. సందీప్ సింగ్ కాల్ డిటైల్ రికార్డ్ ప్రకారం.. గత 10 నెలలుగా అతను సుశాంత్తో టచ్లో లేడని పేర్కొంది. ఆ 10 నెలల కాలంలో వీరిద్దరి మధ్య ఎలాంటి ఫోన్ కాల్స్,మెసేజ్,వాట్సాప్ చాట్ ఏమీ లేవని తెలిపింది.
అంబులెన్స్ డ్రైవర్తో ఎందుకు మాట్లాడాడు...
సుశాంత్తో 10 నెలలుగా టచ్లో లేని సందీప్ సింగ్... అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండేతో మాత్రం టచ్లో ఉన్నట్లు సీడీఆర్ డేటాలో వెల్లడైంది. అంతేకాదు,సుశాంత్ సింగ్ జూన్ 14న మరణించగా... అతని మృతదేహాన్ని తరలించిన అంబులెన్సు డ్రైవర్తో జూన్ 16న సందీప్ సింగ్ మాట్లాడాడు. సుశాంత్ మరణించిన 2 రోజుల తర్వాత అంబులెన్సు డ్రైవర్తో మాట్లాడాల్సిన అవసరం సందీప్ సింగ్కు ఏముందనేది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.
భిన్నమైన స్టేట్మెంట్స్..
సుశాంత్ మరణవార్త తర్వాత సందీప్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా భిన్నంగా ఉన్నాయి. సుశాంత్ మరణవార్త వెలుగుచూసినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని సందీప్ సింగ్ చెప్పగా... ఆ సమయంలో అతను లంచ్ చేస్తున్నాడని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం సుశాంత్ సింగ్ తండ్రి తరుపు న్యాయవాది వికాస్ సింగ్ కూడా సందీప్పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ మరణించిన జూన్ 14న సందీప్ ఆ ఇంట్లోనే ఉండి ఉంటాన్న అనుమానం వ్యక్తపరిచారు.
ఆస్పత్రిలోనూ దుబాయ్ ఫోన్ కాల్...
టైమ్స్ నౌ కథనం ప్రకారం... కర్ని సేనకు చెందిన ఓ సభ్యుడు సందీప్పై అనుమానాలకు తావిచ్చేలా ఓ విషయాన్ని వెల్లడించాడు. 'ఆస్పత్రిలో సుశాంత్ సింగ్ మృతదేహానికి పోస్టుమార్టమ్ పూర్తయిన సందర్భంలో... సురాజ్ సింగ్ అనే ఓ అధికారి,సందీప్ సింగ్ 'దుబాయ్' గురించి ఏదో చర్చించుకుంటుండగా విన్నాను. నేను ఫోన్లో మాట్లాడుతూ వారి వైపు చూడగా ఆ విషయాన్ని గమనించాను. దుబాయ్ నుంచి కాల్ వచ్చినట్లు సందీప్ చెప్పిన మాటను విన్నాను.' ఆ కర్నిసేన సభ్యుడు వెల్లడించాడు. అంతకుముందు సుబ్రహ్మణ్యస్వామి తన ట్వీట్లో 'సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు అతన్ని దుబాయ్కి చెందిన డ్రగ్ డీలర్ అయష్ ఖాన్ కలిశాడు. ఎందుకు..?' అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణానికి అసలు దుబాయ్కి ఉన్న లింకులు ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.