శబరిమలలో పారిశుధ్యానికి ప్రాధాన్యం .. కరోనా కారణంగా కాలిబాట, అభయారణ్య మార్గాలు శానిటైజ్
కేరళ లోని ప్రముఖ దేవస్థానం అయిన శబరిమల అయ్యప్ప దేవస్థానంలో స్వామిని దర్శించుకుంటున్న భక్తుల సందడి మొదలైంది. రెండు నెలల పాటు వార్షిక మండల, మకరవిళక్కు పూజలు కొనసాగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న కారణంగా , ఈ సీజన్లో శబరిమలకు విశేషంగా భక్తజనం, మాలధారులు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు వచ్చే అవకాశం ఉన్న కారణంగా కరోనా వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు .
తెరచుకున్న శబరిమల ఆలయం ... 250 మందికే అనుమతి .. కోవిడ్ నిబంధనలతోనే స్వామి దర్శనం
శబరిమల అభయారణ్యంలో , నడక మార్గంలో శానిటైజేషన్ పనులు
కోవిడ్ నేపథ్యంలో, నడక మార్గాలు మరియు భక్తులు సంచరించే అభయారణ్యాలను శానిటైజ్ చేస్తున్నారు . నడక మార్గాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు . అంతేకాదు భక్తుల భద్రతకు అగ్నిమాపక దళం కూడా రంగంలోకి దిగినట్టు మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు చోట్ల మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పిస్తారు. అగ్నిమాపక దళం తో పాటుగా, అత్యవసర రెస్క్యూ టీమ్ , అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు . భక్తుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు.
కోవిడ్ నెగిటివ్ అయితేనే అనుమతి ... వాహనాలకు శానిటైజేషన్
కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చినవారిని అనుమతిస్తామని, వారి వాహనాలను శానిటైజ్ చేసిన తర్వాతనే అనుమతి ఇస్తామని మంత్రి ఫేస్బుక్లో తెలిపారు.
శబరిమల మండల , మకరవిళక్కు పండుగకు సంబంధించి పంపా నది వద్ద, సన్నిధానం వద్ద విస్తృతమైన సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు అక్కడి ఆలయ అధికారుల ఆదేశాల మేరకు ప్రవర్తించవలసి ఉంటుంది. తిరుముట్టం, 18 మెట్లు, ప్రసాదాల కౌంటర్, నడకదారి మరియు కెఎస్ఇబి ల వద్ద ప్రతి రెండు రోజులకు ఒకసారి శానిటైజ్ చేయనున్నట్లుగా చెప్తున్నారు .
రంగంలోకి అగ్నిమాపక బృందాలు .,. రెస్క్యూ టీమ్స్ ..
ప్రతిరోజూ ఆలయం పైకప్పు కూడా శానిటైజ్ చేస్తున్నారు. మరకూట్టం, శారంకుట్టి, కెఎస్ఇబి, మాలికపురం మరియు అరవానా కౌంటర్ ప్రక్కనే ఉన్న ప్రధాన కంట్రోల్ రూమ్ అనే ఐదు ప్రదేశాలలో అగ్నిమాపక దళాలు మోహరించి భద్రత కల్పిస్తున్నాయి. నడకదారి వద్ద కూడా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
గుంపులుగా కాకుండా స్వామిని దర్శించుకోవటం , ఆన్ లైన్ లో బుక్ చేసుకుని టైం స్లాట్ ప్రకారమే రావటం , మాస్కులు ధరించటం , కోవిడ్ నిగిటివ్ సర్టిఫికెట్ అక్కడి అధికారులకు ఇవ్వటం ద్వారా స్వామి వారిని సులభంగా దర్శించుకోవచ్చు . అలా కాకుండా స్వామి దర్శనం కష్టమే .