ఫ్యామిలీతోనే ఉంటా: ఫ్యాన్స్కు మున్నాబాయ్ థ్యాంక్స్
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మంగళవారం పెరోల్పై విడుదలై ఇంటికి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాను తన కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడిపేందుకే కేటాయిస్తానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని చెప్పారు.
భారతీయ చట్టాలను.. న్యాయస్థానాలను గౌరవిస్తానని సంజయ్ దత్ తెలిపారు. తన పెరోల్ ముగిసిన తర్వాత తిరిగి జైలులో రిపోర్టు చేస్తానని చెప్పారు. మంగళవారం సంజయ్ దత్కు తాత్కాలిక విడుదల లభించింది. 14 రోజుల పాటు పెరోల్పై బయటకు వచ్చేందుకు అతనికి కోర్టు అనుమతి లభించింది. అతని కాలుకు చికిత్స నిమిత్తం ఈ పెరోల్ లభించింది. ఈ మేరకు ఆయన పుణె ఎరవాడ జైలు నుంచి బయటకు వచ్చాడు.
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పుణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది.
టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పుణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్దత్ కాగిత సంచుల తయారీలో శిక్షణ పొందుతున్నాడు.