జైల్లోని డబ్బు భార్యకి, నిద్రపోలేదు: సంజయ్, కంటతడి
ముంబై: తాను ఎరవాడ జైలులో సంపాదించిన రూ.440ని తాను తన భార్య మాన్యతకు ఇచ్చానని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురువారం చెప్పారు. ఆయన ఎరవాడ జైలు నుంచి విడుదలైన అనంతరం ముంబైలోని తన ఇంటికి వచ్చారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి సిద్దివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు.
అనంతరం ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. జైలులో సంపాదించిన రూ.440 తన భార్యకు ఇస్తానని చెప్పారు. తన భార్య నాకు మంచి భాగస్వామి అని, నా బలం ఆమేనని చెప్పారు. నేను భారతీయుడిని అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు.
ఈ రోజు కోసం తాను 23 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. నేను జైలుకు పోయినందుకు నాకంటే నా భార్య మాన్యత ఎక్కువ బాధపడిందన్నారు. మూడు రంగుల జాతీయ జెండాయే నా జీవితం అన్నారు. అందుకే జైలు నుంచి బయటకు రాగానే భారత భూమిని ముద్దాడానని చెప్పారు.
జాతీయ జెండాకు వందనం చేశానని చెప్పారు. జైలులో నుంచి విడుదలకు నాలుగు రోజుల ముందు తాను భోజనం చేయలేదని చెప్పారు. జైలు నుంచి బయటకు వస్తున్నానన్న ఆనందంలో నిన్న రాత్రి తినలేదు, నిద్రపోలేదని చెప్పారు.
ఇన్నాళ్లకు తనకు స్వాతంత్ర్యం లభించిందన్నారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా ఏదో పెరోల్ మీద బయటకు వచ్చినట్లే అనిపిస్తోందన్నారు. ఈ సమయంలో తనకు తన తండ్రి బాగా గుర్తుకు వస్తున్నారని, ఆయన ఉంటే సంతోషించేవారన్నారు.
ఈ సందర్భంగా సంజయ్ దత్.. నాన్నా నేను బయటకు వచ్చేశాను అని పైకి చూస్తూ చెప్పారు. తాను ఈ దేశ పౌరుడిని, భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు. శిక్షను విధించే సమయంలో కోర్టు.. తాను తీవ్రవాదిని కానని చెప్పిందని, ఆ రోజు చాలా సంతోషంగా అనిపించిందన్నారు.
ఆ విషయం తన తండ్రి సునీల్ దత్కు తెలిస్తే ఇంకా బాగుండేదన్నారు. తన చిన్నతనంలోనే తన తల్లి కేన్సర్ వ్యాధితో చనిపోయిందని, ఆమె సమాధి వద్దకు వెళ్లి తాను స్వేచ్ఛా జీవిని అని చెప్పడం తన విధి అన్నారు. సెలబ్రిటీని కాపట్టి పెరోల్ వచ్చిందనో, ముందుగా విడుదల చేశారనో అనుకోవడం తప్పన్నారు.
తన ప్రవర్తనను బట్టి వాళ్లు నిర్ణయం తీసుకొని ఉంటారని చెప్పారు. మాన్యత తన బెటర్ హాఫ్ మాత్రమే కాదని, బెస్ట్ హాఫ్ అన్నారు. ఓ మంచి భర్తగా తాను జైల్లో సంపాదించిన మొత్తాన్ని ఆమెకు ఇచ్చానని చెప్పారు. ఇక నుంచి తాను రెండు విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తానని చెప్పారు.
మొదట తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. కుటుంబం తర్వాతే తన వ్యక్తిగత పనిని చూసుకుంటానని చెప్పారు. నేను ఈ దేశ పౌరుడిని అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు. నేను ఉగ్రవాదిని కానని టాడా కోర్టు తనకు విముక్తి కలిగించిందన్నారు.
నేను ఉగ్రవాదని కానని, అలా అనవద్దని ఆయన చేతులెత్తి మొక్కారు. ఇక నుంచి తనను 1993 పేలుళ్ల కేసుతో జతపర్చవద్దని చెప్పారు. తెలిసీ తెలియని చిన్న వయస్సులో చేసిన చిన్నపొరపాటు వల్ల ఇదంతా జరిగిందని చెప్పారు.
ఈ సందర్భంగా సంజయ్ దత్ తన భార్య, కొడుకు, కూతుళ్లతో కలిసి మీడియాకుఫోజులు ఇచ్చారు. కాగా, సంజయ్ దత్ మాట్లాడిన సమయంలో ఆయన సతీమణి మాన్యత కంటతడి పెట్టారు. ఇదిలా ఉండగా జైలులో ఉండగా సంజయ్ దత్ జైలు దుస్తులు ధరించేందుకు నిరాకరించారట.