గిరిరాజ్పై కాంగ్రెస్ భగ్గు, స్మృతిపై కామెంట్స్ని సమర్థించుకున్న ఎంపీ
ముంబై: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. గురువారం నాడు ముంబై, ఢిల్లీ, పాట్నా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ముంబైలో జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంజయ్ నిరుపమ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పైన చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. ఆయన గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ... తాను గిరిరాజ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో 2012లో ఓ టెలివిజన్ చర్చలో భాగంగా స్మృతి ఇరానీ పైన చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.
సంజయ్ నిరుపమ్ తన తలకు నల్లటి గుడ్డ కట్టుకొని నిరసన తెలిపాడు. ఈ సమయంలో పలువురు గతంలో స్మృతి ఇరానీ పైన చేసిన వ్యాఖ్యల గురించి అడిగారు. దానిపై ఆయన స్పందిస్తూ.. తాను తప్పుగా మాట్లాడలేదని, ఆమె నటి అని, ఆమె ప్రస్తుతం రాజకీయ నాయకురాలు అని, తాను అంతే చెప్పానని, ఎలాంటి సెక్సియెస్ట్ కామెంట్స్ చేయలేదన్నారు.
కాగా, 2012 టెలివిజన్ డిబేట్లో సంజయ్ మాట్లాడుతూ... నిన్నటి వరకు టెలివిజన్లో డ్యాన్స్ చేశావు, ఇప్పుడు రాజకీయ నాయకురాలివయ్యావు అని అన్నారు. దీనిపై స్మృతి ఇరానీ పరువు నష్టం దావా కూడా వేశారు.
కాంగ్రెస్ నేతలు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అంతేకాక వాటిని సమర్థించుకుంటున్నారని, ఇప్పుడు మాత్రం బీజేపీ నేతలను విమర్శిస్తున్నారని కమలం మద్దతుదారులు అంటున్నారు. అయితే, బీజేపీ నేతల వ్యాఖ్యల పైన బీజేపీ అధినాయకత్వం క్లాస్ పీకుతున్న విషయం తెలిసిందే.