కాంగ్రెస్ శివసేనల మధ్య లొల్లి షురూ... ఆయన విషయంలో తేడాలు వస్తున్నాయా?
మహారాష్ట్రలో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. హిందుత్వ నేత వినాయక్ దామోదర్ సావర్కర్ గురించి కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడాన్ని సంజయ్ రౌత్ తప్పుబట్టారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థల్లో ఒక పుస్తకాన్ని పంచారు. అందులో వీర్ సావర్కర్ గురించి ప్రస్తావించారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేతో సావర్కర్కు సత్సంబంధాలు ఉండేవని రాశారు. అయితే ఆ రాతలను తప్పుబట్టారు సంజయ్ రౌత్. సావర్కర్పై శివసేన స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని మరోసారి గుర్తుచేశారు. సావర్కర్ ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ఆయన తమ గుండెల్లో ఎప్పుడూ ఉంటారని సంజయ్ రౌత్ అన్నారు.
కొందరు కావాలనే సావర్కర్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ మహోన్నత వ్యక్తిని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు సంజయ్ రౌత్. ఇలా మాట్లాడే వారి బుద్ది కుటిలమైనది అన్న సంజయ్ రౌత్... వారి బుర్రలను శుభ్రపరుచుకోవాలని సలహా ఇచ్చారు. వీర్ సావర్కర్ ఎంతటి వీరుడు అని పుస్తకంలో ప్రచురించడం జరిగింది. ఈ రాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు శివసేన ఎంపీ. వీర్సావర్కర్ను అవమానించేవారి మెదళ్లను ముందుగా పరీక్షించాలని ఎద్దేవా చేశారు.
అండమాన్ సెలులార్ జైలు నుంచి సావర్కర్ విడుదలయ్యాక బ్రిటీషు వారినుంచి డబ్బులుతీసుకున్నారని పుస్తకంలో రాశారు.ఇలాంటి తప్పుడు రాతలు పుస్తకంలో రాసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్. పుస్తకం మొత్తం అబద్దాలు అసత్యాలే ఉన్నాయని మండిపడ్డారు. గాంధీ హత్య కేసులో సావర్కర్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిందన్న విషయాన్ని చంద్రకాంత్ పాటిల్ గుర్తుచేశారు. ఇది తెలిసి కూడా కాంగ్రెస్ అనుబంధ సంస్థలు కావాలనే సావర్కర్ను అవమానపరిచేలా పుస్తకాన్ని ముద్రించిందని మండిపడ్డారు పాటిల్.
గత నెలలో ఓ సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ... తన పేరు రాహుల్ సావర్కర్ కాదని చెప్పడంతో అప్పుడే శివసేన రాహుల్ గాంధీపై మండిపడింది. ఇక అప్పటి నుంచి శివసేన కాంగ్రెస్ల మధ్య ఓ సైలెంట్ వార్ నడుస్తోంది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని శివసేప డిమాండ్ చేసినప్పటికీ తాను ఎందుకు క్షమాపణ చెప్పాలంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. మరోవైపు తన తాత సావర్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని నడిరోడ్డులో నిలబెట్టి కొట్టాలని సావర్కర్ మనవడు సీఎం ఉద్ధవ్ థాక్రేను డిమాండ్ చేశారు.