బెల్గామా..? పాకిస్థానా..? పర్యటనకు అనుమతించకపోవడంపై సంజయ్ రౌత్ ఫైర్
కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై శివసేన నేత సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. బెల్గాంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇది బెల్గాం లేదంటే ఇతర దేశమా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
దేశంలోకి పాకిస్తానీలు ప్రవేశించొచ్చు, బంగ్లాదేశ్కి చెందిన రోహింగ్యాలు కూడా ప్రవేశించొచ్చు.. కానీ బెల్గాం జిల్లాలోకి మహారాష్ట్రీయులు అడుగుపెట్టొద్దా అని ప్రశ్నించారు. ఇది తప్పు అని.. ఒకరిపై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉండొద్దని అభిప్రాయపడ్డారు. అంతేకాదు తనను అరెస్ట్ చేసిన పోలీసులు తెలియని ప్రదేశానికి తరలించారని సంజయ్ రౌత్ ఆరోపించారు.
బెల్గాం జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లి ప్రజలతో తాను మాట్లాడాల్సి ఉండేదని సంజయ్ రౌత్ చెప్పారు. కానీ మీరు ఆంక్షలు విధించడం వల్ల కుదరలేదని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే మరోవైపు మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర పాటిల్ యెద్రవ్కర్ కూడా బెలాగవి జిల్లాలో ఛేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే కొందరు మాట్లాడనీయకుండా అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మంత్రిని మాట్లాడనీయకుండా అడ్డుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు. 1980లో చనిపోయిన మరాఠీ అనుకూల అమరవీరుల దినోత్స కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి విచ్చేసిన సంగతి తెలిసిందే.