‘కాంగ్రెస్కు మాఫియాతో లింకులు.. వివాదంలోకి మాజీ ప్రధాని.. సోనియా, రాహుల్ నోరు విప్పాలి‘
ముంబై అండర్ వరల్డ్ మాఫియా నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నిధుల ప్రవాహం జరిగి ఉండవచ్చనే అనుమానాన్ని మహారాష్ట్ర మాజీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ వ్యక్తం చేశారు. కరీం లాలా అనే మాఫియా లీడర్ను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కలుసుకొనే వారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేిస వివాదాస్పద వ్యాఖ్యలపై ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..
మాఫియాతో నేరపూరిత రాజకీయాలు
80 దశకంలో మాఫియా ప్రభావం వల్లే రాజకీయాలు నేరపూరితంగా మారాయి. ముంబైపై దాడికి పాల్పడిన మాఫియాకు కాంగ్రెస్ అండగా నిలిచిందేమోననే సందేహాన్ని వ్యక్తం చేశారు. రౌత్ చేసిన కామెంట్లు, ఆరోపణలపై మౌనం వహించకుండా క్లారిటీ ఇవ్వాలని ఫడ్నవీస్ సూచించారు.
కాంగ్రెస్కు అండర్ వరల్డ్తో లింకులు
80, 90వ దశకంలో కాంగ్రెస్ గెలువడానికి అలాంటి బలం అవసరం ఉండి ఉంటుందనే అభిప్రాయాన్ని ఫడ్నవీస్ వ్యకత్ం చేశారు. అప్పట్లో ముంబై కమిషనర్ ఎవరుండాలనేది? అలాగే సెక్రటేరియట్లో ఎవరు ఉండాలో అనేది కూడా మాఫియా డాన్స్ చోటా షకీల్, దావూద్ ఇబ్రహీం డిసైడ్ చేసేవారని ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోనియా, రాహుల్ స్పందించాలి
కరీం లాలాతో ఇందిరా గాంధీకి సంబంధాలు ఉండేవని సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సమాధానం ఇవ్వాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించారు. ముంబై దారుణంగా దాడి చేసిన మాఫియాను కాంగ్రెస్ ప్రోత్సహించిందా? కాంగ్రెస్ ఈ వ్యవహారంపై ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ఘాటుగా స్పందించారు.
సంజయ్ రౌత్ తాజా వ్యాఖ్యలు ఇవే..
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ సెక్రటేరియట్కు వచ్చేవారు, దక్షిణ ముంబైలోని పైదోనీలో కరీమ్ లాలాను ఇందిరా గాంధీ కలుసుకొనే వారు అని చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం సృష్టించాయి.
కరీం లాలా, హాజీ మస్తాన్, వరదరాజన్ గురించి
రెండు దశాబ్దాల పాటు ముంబై నేర సామ్రాజ్యాన్ని కరీం లాలాతోపాటు మస్తాన్ మీర్జా అలియాస్ హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్లు శాసించారు. 60వ దశాబ్దం నుంచి 80వ దశాబ్దం ముగింపు వరకు ఈ ముగ్గురు ముంబైలో నేర కార్యక్రమాలను యదేచ్ఛగా సాగించారన్న విషయం తెలిసిందే.