పాకిస్థాన్ను ఫినిష్ చేయండి.. మీ స్కూల్కు హెడ్మాస్టర్లం.. అమిత్ షాకు సంజయ్ రౌత్ ఝలక్
పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో వాడివేడి వాదనలను నేతలు వినిపిస్తున్నారు. పెద్దల సభలో అనుకూల, ప్రతికూల వాదనలు వాతావరణాన్ని కాక పుట్టిస్తున్నాయి. తమ తమ పార్టీల అజెండా ప్రకారం ఎంపీలు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ బిల్లుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభ పాకిస్థాన్ అసెంబ్లీ కాదు. మనమంత ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులం. ఒకవేళ పాకిస్థాన్ విధానాలు నచ్చకపోతే బలమైన ప్రభుత్వం ఆ దేశాన్ని ఫినిష్ చేయాలి. ప్రధాన మంత్రి, హోం మంత్రి పీఠాలపై శక్తిమంతమైన వ్యక్తులు ఉన్నప్పుడు పాకిస్థాన్ను మనం ఫినిష్ చేయలేమా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. పాకిస్థాన్లో మైనారిటీల హక్కులను కాలరాసారని ఆరోపించినప్పుడు.. ఆ దేశాన్ని మనం ఎందుకు నేలమట్టం చేయకూడదు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కొత్త చట్టం అమల్లోకి వస్తే కాందీశీకులు దేశ పౌరసత్వాన్ని పొందితే వారు ఓటర్లుగా మారుతారా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి సంజయ్ మాట్లాడుతూ.. మేము జాతీయ వాదులమా లేదా హిందుత్వ వాదులామా అని మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ స్కూల్ అయితే అనుకొంటున్నారో.. ఆ స్కూల్కు మేము హెడ్మాస్టర్లం. మా హెడ్మాస్టర్లుగా బాల్ సాహెబ్ థాకరే, శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారు. వారిని మా హెడ్మాస్టర్లుగా కూడా భావిస్తాం అని చురకలు అంటించారు.
కొద్ది రోజుల నుంచి మీడియాలో ఈ బిల్లు గురించి చాలా వార్తలు వింటున్నాం. బిల్లును వ్యతిరేకిస్తే దేశ ద్రోహులని, మద్దతు తెలిపితే జాతీయవాదులనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది ఏ మాత్రం సమంజసం కాదు అని సంజయ్ రౌత్ అన్నారు.