స్కెచ్ వేస్తే మాదే గెలుపు.. ఆ అత్యున్నత పదవికి శరద్ పవార్ కరెక్ట్.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ ఆకాంక్షిస్తున్నారు. 2022 జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర కూటమి బలంగా ఉంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐక్యమత్యంగా ఉంటే అధికార పార్టీ అభ్యర్థిని ఎదురించి విజయం సాధించడం ఖాయమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ను..
దేశంలోని సీనియర్ నేతల్లో శరద్ పవార్ ఒకరు. రెండేళ్లలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పేరును అన్ని రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇది శరద్ పవార్ నుంచి వచ్చిన ప్రతిపాదన కాదని, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని రౌత్ మీడియాకు వెల్లడించారు.
గెలిపించుకొనే మెజారిటీతో
2022 నాటికి ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థి ప్రకటించడం సాధారణమైన విషయమే. కానీ మా కూటమి తరఫున అభ్యర్థి గెలువడానికి సరిపోయే మెజారిటీ మాకు ఉంటుంది. మా అభ్యర్థి శరద్ పవార్ అయితే బాగుంటుందనేది నా అభిప్రాయం అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో పవార్ మార్క్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రాజకీయ చతురతను ఊపయోగించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శరద్ పవార్ తన మార్కును చూపించిన సంగతి తెలిసిందే. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని సంఘటితం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శివసేన నేత సంజయ్ రౌత్ కూడా తన చాణక్యాన్ని నడిపారనే విషయం తెలిసిందే.
ప్రభుత్వ ఏర్పాటు చతురత
అంతేకాకుండా మహారాష్ట్ర వికాస్ అఘాదీ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన విస్తరణలో పవార్ తన అధిపత్యాన్ని కనబరిచారు. తన పార్టీకి హోం, ఫైనాన్స్ శాఖలను ఇప్పించుకోవడం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటులో కూడా మోదీ, అమిత్ షా ఎత్తులకు పవార్ పై ఎత్తులు చేయడం రాజకీయ వర్గాలను ఆకట్టుకొన్నది.