తీహార్ జైలు: సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి మాస్టర్ స్కెచ్
న్యూఢిల్లీ: అతను సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం తీహార్ జైలులో కాలం వెల్లదీస్తున్నాడు. కరుడు కట్టిన నేరస్తులతో కలిసి తన స్నేహితుడిని హత్య చెయ్యాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. విషయం పసిగట్టిన ఢిల్లీ పోలీసు అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
హర్యానా టీచర్ల నియామకం కుంభకోణంలో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ తీహార్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం సంజీవ్ కుమార్ సస్పెండ్ అయ్యాడు. ఇతను మాఫియా డాన్ షౌకత్ పాష, షార్ప్ షూటర్ తౌఫిక్, మున్నాలను కలిశాడు.
తన స్నేహితుడిని హత్య చెయ్యాలని ఒప్పందం కుదుర్చుకుని కిరాయి ఇచ్చాడు. అంతే కాకుండ జైలులో తన మీద దాడి చేశారని నాటకం ఆడాడు. హర్యానా మాజీ సీఎం ఒ.పి. చౌతాల కుటుంబ సభ్యులు తన మీద దాడి చేయించారని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ విషయం ఢిల్లీ పోలీసులు పసిగట్టారు. జైలులో తన మీద దాడి జరిగిందని ఆరోపణలు చేస్తే త్వరగా బెయిల్ వస్తుందని సంజీవ్ కుమార్ ప్లాన్ వేశాడని, అదే విధంగా అతని స్నేహితుడిని అంతం చేయించడానికి చక్కటి అవకాశం వస్తుందని సంజీవ్ కుమార్ ప్లాన్ వేశాడని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంజీవ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.