పరువు హత్యపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు: యువతి తండ్రి నిర్దోషి, నిందితులకు యావజ్జీవ శిక్ష..
తమిళనాడులో కలకలం రేపిన పరువు హత్యలో యువతి తండ్రిని మద్రాస్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. హత్య కేసులో చిన్నస్వామి నేరం చేయించినట్టు ఆధారాలు లేవని ఎం సత్యనారాయణన్, ఎం నిర్మల్ కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొన్నది. కానీ దళిత యువకుడు శంకర్ను హతమార్చిన ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధించింది. శిక్ష 25 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటుందని తెలిపింది.
ప్రేమ.. పెళ్లి
తిరుప్పూరు జిల్లా తివర్కు చెందిన గౌసల్య, దళిత యువకుడు శంకర్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గౌసల్య ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ ఆమె పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. దీంతో గౌసల్య తండ్రి చిన్నస్వామి రగిలిపోయాడు. సమయం కోసం చూశాడు. అదనుచూసి 2016లో ఉడుమల్ పేట వద్ద పట్టపగలు రోడ్డుపై శంకర్ను హత్య చేయించాడు. దాడిలో గౌసల్య కూడా గాయపడ్డారు. శంకర్ను ఆస్పత్రి తీసుకెళ్లేలోపు చనిపోయాడు. దాడి ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. కేసు విచారించిన పోలీసులు గౌసల్య తండ్రి, తల్లి, కిరాయి రౌడీలపై అభియోగాలు మోపారు. తిరుప్పూరు జిల్లా కోర్టు వీరందరికీ ఉరిశిక్ష విధించింది. అయితే ఉరిశిక్షను సవాల్ చేస్తూ.. చిన్నస్వామి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో ఊరట..
ఇక్కడ వీరికి ఊరట కలిగింది. చిన్నస్వామి, సహా అతని భార్యను మద్రాస్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. హత్య చేసిన జగదీశన్, మణికందన్, సెల్వకుమార్, కలై తమిళ్వణమ్, మదన్ అలియాస్ మైఖేల్ యావజ్జీవ శిక్ష వేస్తున్నట్టు పేర్కొన్నది. హత్య కేసులో ప్రాసిక్యూషన్ మార్పింగ్ చేసి ఆధారాలు ప్రవేశపెట్టిందని చిన్నస్వామి తరఫు న్యాయవాది సుందరసన్ పేర్కొన్నారు. హత్య జరిగిన నాలుగురోజుల తర్వాత షాపు నుంచి ఫుటేజీ సేకరించి, మార్పింగ్ చేసి అభియోగం మోపారని తెలిపారు. ఆ వీడియోపై తాము అప్పుడే అభ్యంతరం తెలియజేశామని పేర్కొన్నారు.
15 రోజుల తర్వాత..
హత్య జరిగిన 15 రోజుల తర్వాత నిందితులను పోలీసులు గుర్తించారు. అప్పటికే చిన్నస్వామి ఫోటోలు పేపర్లో అచ్చయ్యాయి అని తెలిపారు. దీంతో సాధారణంగానే సాక్ష్యులుగా ప్రవేశపెట్టిన వారు చిన్నస్వామిని వేలెత్తి చూపంచారని తెలిపారు. కూతురి పెళ్లి చేసుకున్నాక చిన్నస్వామి అంగీకరించారని.. శంకర్ను హత్య చేయలేదు అని పేర్కొన్నారు.
ఉరి శిక్ష..
శంకర్ హత్య కేసులో తిరుప్పూరు సెషన్స్ కోర్టు 2017 డిసెంబర్ 12వ తేదీన తీర్పును వెలువరించింది. చిన్నస్వామి ప్రోద్బలంతోనే నేరం జరిగిందని.. 10 జైలు శిక్షతోపాటు ఉరిశిక్ష కూడా విధించింది. జైలు శిక్ష పూర్తయ్యాక ఉరి తీయాలని జడ్జీ అలమేలు నటరాజన్ తీర్పునిచ్చారు. హత్య చేసిన ఐదుగురికి 18 ఏళ్ల జైలు శిక్షతోపాటు ఉరి శిక్ష విధించారు.