నాన్నకు ప్రేమతో: ఈ కోటి రూపాయలు నాన్నకే సొంతం..కేబీసీలో బీహారీ హవా
ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 11లో తొలిసారిగా ఓ కంటెస్టెంట్ రూ.కోటి గెలుచుకున్నాడు. బీహార్లోని జెహానాబాద్ జిల్లాకు చెందిన సనోజ్ రాజ్ రూ.కోటి గెలుచుకుని సీజన్ 11లో తొలిసారిగా రూ. కోటి గెలిచిన వ్యక్తిగా నిలిచాడు. ఇక ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి ఉంటే రూ.7 కోట్లు జాక్పాట్ కొట్టేసేవాడు. ఈ విజయం తన తండ్రికి అంకితం ఇస్తున్నానని తాను గెలిచిన డబ్బు కూడా తన తండ్రితేనని చెప్పి ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.
తండ్రి పడ్డ శ్రమకు ఫలితం దక్కింది
"మానాన్న ఒక రైతు. ఈ డబ్బు నేను ఇస్తున్నాని కాదు కానీ ఇది తన డబ్బే. తను చదువుకునేందుకు డబ్బులేదని తన పిల్లలు అలా కాకూడదని కష్టపడి మమ్మలను చదివించారు" అని సనోజ్ రాజ్ చెప్పాడు. ఇక ఈ కార్యక్రమానికి సనోజ్తో పాటు తన తండ్రి, మామ వచ్చారు. రూ. కోటి గెల్చుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసి ఇక తమ కుటుంబ కష్టాలు గట్టెక్కినట్లే అని చెప్పిన సనోజ్... తను పడ్డ శ్రమకు ఫలితం దక్కిందని భావోద్వేగానికి గురయ్యాడు. ఇక తనను కోటీశ్వరుడిని చేసిన ప్రశ్న: ఏ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తండ్రి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు అని.. దీనికి సమాధానంగా ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అని చెప్పాడు. అయితే ఈ సమాధానం చెప్పేందుకు లైఫ్లైన్ వినియోగించుకున్నాడు.
చివరి ప్రశ్నకు సమాధానం చెప్పలేకోపోయిన సనోజ్
ఇక చివరి ప్రశ్నగా ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ లెజెండ్ డాన్ బ్రాడ్మ్యాన్, తన 100వ ఫస్ట్ క్లాస్ సెంచరీ సింగిల్తో పూర్తి చేశాడు. ఆయనకు బౌలింగ్ వేసిన భారతీయ బౌలర్ ఎవరు అని సంధించారు..? అయితే దీనికి సమాధానం చెప్పలేక పోయాడు సనోజ్ రాజ్, దీనికి సమాధానం గొగుమాల్ కిషన్ చంద్. ఇక అప్పటికే తను లైఫ్ లైన్లు వినియోగించుకున్నట్లు సనోజ్ చెప్పాడు. మొత్తం 10 మంది కంటెస్టెంట్లను ఓ హోటల్లో ఉంచినట్లు చెప్పిన సనోజ్.. ఆ సమయంలో అందరం చాలా కలివిడిగా ఉండేవాళ్లం అని చెప్పారు. ఇక యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నందున కౌన్ బనేగా కరోడ్ పతి షో కోసం ప్రత్యేకించి ఏమీ చదవలేదని చెప్పాడు.
అమితాబ్ గురించి ఏమన్నాడంటే
ఇక అమితాబ్ బచ్చన్ గురించి చెబుతూ బిగ్బీని ఎప్పుడూ తెరమీద చూడటమే కానీ.. ఇలా ఎదురుగా కూర్చొని తనతో ఓ గేమ్షోలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదని సనోజ్ రాజ్ చెప్పాడు. తనను తొలిసారిగా కలిసినప్పుడు ఒక పాత పరిచయస్తుడితో మాట్లాడినట్లు అమితాబ్ బచ్చన్ మాట్లాడారని చెప్పాడు సనోజ్. ప్రస్తుతం తాను సివిల్ ఎగ్జామ్స్ పై దృష్టి సారించినట్లు చెప్పాడు. త్వరలో ఐపీఎస్ అయి మళ్లీ ప్రజలకు సేవలందిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. అంతకు ముందు ఢిల్లీలోని టీసీఎస్లో సనోజ్ ఉద్యోగం చేశాడు.