ఇకపై రైల్వే స్టేషన్లలో అది కనిపించదు.. ఉత్తర రైల్వే సంచలన నిర్ణయం
ఊళ్ల పేర్ల మార్పిడిలో ముందున్న ఉత్తరాదిలో ఇక భాషా పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రైల్వే స్టేషన్లలోని నేమ్ బోర్డులపై ఉర్దూను తొలగించాలని ఉత్తరాఖండ్ రైల్వే అధికారులు నిర్ణయించారు. అంటే ఇకపై అక్కడి రైల్వే స్టేషన్లలో ఆ భాష కనిపించదు. ఉర్దూకు బదులు సంస్కృత భాషలో పేర్లను రాయాలని డిసైడయ్యారు. దీనికి సహేతుక కారణాలు కూడా వివరించారు.
మాన్యువల్ ను అనుసరించి..
మన దేశంలోని ఏ రైల్వే స్టేషన్ కు వెళ్లినా నేమ్ బోర్డులు మూడు భాషల్లో కనిపిస్తాయి. ఒకటి ఇంగ్లీష్, రెండు హిందీ, మూడోది.. ఆయా రాష్ట్రాల్లోని ద్వితీయ అధికారిక భాష. రైల్వే మాన్యువల్ లో ఈ మేరకు స్పష్టమైన నిబంధనలున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఉర్దూ రెండో అధికారిక భాష కావడంతో అక్కడి రైల్వే స్టేషన్లలో దానికి చోటుదక్కింది. అయితే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్.. 2010లో సంస్కృతాన్ని రెండో అధికారిక భాషగా గుర్తించింది. అయితే బోర్డులు మాత్రం మార్చలేదు.
కీలక ఆదేశాలు..
రెండో అధికారిక భాషగా గుర్తించిన తర్వాత కూడా సంస్కృతాన్ని రైల్వే స్టేషన్ల నేమ్ బోర్డులపై ఎందుకు రాయడంలేదంటూ ఓ వ్యక్తి నిలదీయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. మొరాదాబాద్ రైల్వే డివిజన్ అంతటా బోర్డులపై ఉర్దూను తొలగించి, సంస్కృత భాషలో పేర్లు రాయాలని ఆదేశించినట్లు ఉత్తర రైల్వే చీఫ్ పీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు.
అందరికీ అర్థమవుతుందా?
పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఉన్న ఉత్తరాఖండ్ కు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. సంస్కృత భాషలో పేర్లు రాస్తే అందరికీ అర్థమవుతుందా? లేదా? అనే సందేహాలు అవసరం లేదని అధికారులు అంటున్నారు. హిందీ లాగే సంస్కృతం కూడా దేవనాగరి లిపికి చెందినదేకాబట్టి స్క్రిప్టును ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చని చెబుతున్నారు.