శారదా చిట్ ఫండ్ కుంభకోణం: సీబీఐ రిపోర్టులో చాలా తీవ్రమైన అంశాలున్నాయన్న సుప్రీం
ఢిల్లీ: శారదా చిట్ ఫండ్ స్కాములో సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇందులో కోల్కతా సీపీ రాజీవ్ కుమార్ పాత్రగురించి పొందుపరిచింది సీబీఐ. ఈ రిపోర్టును పరిశీలించిన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి రాజీవ్ కుమార్ సాక్షాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను విచారణ చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు నెలరోజుల ముందు ఆదేశించింది. ప్రజల జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరోకోబోమని ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. చిట్ఫండ్ స్కామ్లో నాడు రాజీవ్ కుమార్ నేతృత్వంలోనే సిట్ ఏర్పాటు అయ్యింది. అయితే రాజీవ్ కుమార్ పారదర్శకతతో వ్యవహరించలేదనే ఆరోపణలు వచ్చాయి.
రంగీళా బ్యూటీ పొలిటికల్ ఎంట్రీ.. ఈ పార్టీ తరపున ఇక్కడి నుంచే పోటీ..?
సీబీఐ నమోదు చేసిన అభియోగాలు చాలా సీరియస్గా ఉన్నాయి
సీబీఐ సమర్పించిన నివేదిక చదివిన ధర్మాసనం పూర్తి వివరాలతో మరో 10 రోజుల్లో పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఇక ఈ కేసుతో సంబంధమున్న సీపీ రాజీవ్ కుమార్, ఇతరులకు తమ స్పందన తెలిపేందుకు ఏడురోజుల సమయం ఇచ్చింది. కేసు విచారణకు సంబంధించిన అంశాలను సీల్డ్ కవర్లో సమర్పించినందున ఇప్పటికైతే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని .... సీపీ రాజీవ్ కుమార్ తరుపున కూడా వాదనలు విన్న తర్వాతే తీర్పు చెబుతామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అదే సమయంలో బెంగాల్ ఛీఫ్ సెక్రటరీ మరియు డీజీపీల పేర్లను సీబీఐ పిటిషన్లో చేర్చగా వాటిని తొలగించేందుకు నిరాకరించింది.
గతనెలలో సీబీఐ అధికారులను అరెస్టు చేసిన కోల్కతా పోలీసులు
గత నెల 3వ తేదీన శారదా చిట్ ఫండ్ స్కామ్లో సీపీ రాజీవ్ కుమార్ను విచారణ చేసేందుకు సీబీఐ వెళ్లగా ఆ రాష్ట్ర పోలీసులు సీబీఐ అధికారులను చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ రాజీవ్ కుమార్ హాజరు కాలేదని అందుకే తామే స్వయంగా అతని నివాసంకు వెళ్లినట్లు సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు విచారణకు సహకరించకపోగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించింది సీబీఐ.
సాక్ష్యాలను ధ్వంసం చేసి ఉంటే తీవ్ర పరిణామాలు: సుప్రీం
సీబీఐ పిటిషన్ విచారణ చేసిన సుప్రీంకోర్టు ఆ సమయంలో సీరియస్ అయ్యింది. విచారణకు సహకరించాల్సిందేనంటూ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఒకవేళ నిజంగానే రాజీవ్ కుమార్ సాక్షాలను ధ్వంసం చేసిఉంటే అందుకు సంబంధించిన ఆధారాలు కోర్టు ముందు ఉంచాలని జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు. నిజంగానే సాక్షాలను ధ్వంసం చేసి ఉంటే రాజీవ్ కుమార్పై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు.