దీదీకి షాక్: టిఎంసి ఎంపి ముకుల్రాయ్కి సిబిఐ నోటీసులు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైన శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగలింది. శారదా కుంభకోణం కేసులో సోమవారం టిఎంసి ఎంపి ముకుల్ రాయ్కి సిబిఐ నోటీసులు జారీ చేసింది.
కాగా, ఆ సంస్థకు ముకుల్ రాయ్ ఇప్పటి వరకు కూడా ఇంఛార్జ్గా వ్యవహరిస్తుండటం గమనార్హం. టిఎంసిని రాజకీయపరంగా దెబ్బతీసేందుకు సిబిఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ.. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నామని ఆదివారం టిఎంసి పేర్కొంది.
2015 జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ గ్రామస్థాయి నుంచి ఉన్న తన పట్టుకోల్పోకుండా, ముస్లీం కమ్యూనిటీని దూరం చేసుకోకుండా ఉండేందుకు ఆ పార్టీ బిజెపిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తోంది.
2011లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి శారదా కుంభకోణం టిఎంసిని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రమంత్రి మదన్ మిత్రా, ఇద్దరు పార్టీ ఎంపీలు కునాల్ ఘోష్, శృంజయ్ బోస్లు అరెస్టయ్యారు.
వేలకోట్ల రూపాయల శారదా స్కాంలో మరింత మందిని సిబిఐ విచారించేందుకు సిద్ధమవుతోంది. ఇంకా చాలామంది నాయకులకు ఈ స్కాంతో సంబంధాలున్నాయనే కోణంలో సిబిఐ విచారిస్తోంది. కాగా, సిఎం మమతా బెనర్జీ మాత్రం తమ మంత్రులకు, ఎంపీలకు ఈ స్కాంతో సంబంధం లేదని వాదిస్తున్నారు.