శారదా స్కాం: నళిని చిదంబరంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ/చెన్నై: శారదా చిట్ఫండ్ కుంభకోణంలో మరోసారి మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుటుంబానికి షాక్ తగిలింది. ఈ స్కాంలో పి చిదంబరం భార్య నళినికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. ఈ మేరకు ఈడీ బుధవారం ఆమెకు సమన్లు జారీ చేసింది.
శారద స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇటీవల రూపొందించిన ఆరో అనుబంధ ఛార్జ్షీట్లో నళిని పేరును చేర్చింది. అయితే ఈ కేసులో నళినిని సాక్షి లేదా నిందితురాలిగా కాకుండా.. వివాదాస్పద ఛానల్ ఒప్పందం గురించి తెలిసిన రహస్య వ్యక్తిగా పేర్కొన్నారు. దీనిపై విచారించేందుకే ఆమెకు సమన్లు జారీ చేశారు.
2013లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన శారద చిట్ఫండ్ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ఇన్వెస్టర్ల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శారదా చిట్ఫండ్ గ్రూప్ తర్వాత బోర్డు తిప్పేసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు అరెస్టై, బెయిల్పై విడుదలయ్యారు. ఇంకా వారిపై విచారణ కొనసాగుతోంది.