శారదా స్కాం: రూ. 1.19కోట్లు తిరిగిచ్చిన మిథున్
కోల్కతా: శారదా గ్రూప్ నుంచి పొందిన రూ. 1.19 కోట్లను బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి)కు తిరిగిచ్చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైన మిథున్ చక్రవర్తిని, ఈడి ఇటీవలే శారదా కుంభకోణంకు సంబంధించి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా మిథున్ చక్రవర్తి తను పొందిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ మొత్తం సొమ్మును మంగళవారం ఈడికి ఇచ్చేశారు. గత నెలలోనే విచారించిన ఈడి.. మిథున్ చక్రవర్తికి శారదా స్కాంతో సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చింది.
శారదా స్కాంలో నష్టపోయిన డిపాజిటర్లకు శారదా గ్రూప్ నుంచి తాను పొందిన మొత్తాన్ని అందజేయాలనే ఉద్దేశంతోనే మిథున్ చక్రవర్తి తన వద్ద ఉన్న రూ. 1.19కోట్లను తిరిగిచ్చేశారని ఈడి పేర్కొంది.
కాగా, తనకు ఎవరినీ మొసం చేసే ఉద్దేశం లేదని ఈడికి మిథున్ చక్రవర్తి వెల్లడించారు. అందుకే తాను శారదా గ్రూప్ నుంచి పొందిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లు మిథున్ చక్రవర్తి తెలిపారు.
శారదా స్కాంలో డిపాజిటర్లను మోసం చేసి లెక్కలేనంత సొమ్మును కాజేశారనే ఆరోపణలతో టిఎంసికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులను అరెస్ట్ చేసిన ఈడి.. వారిని విచారించింది. దీంతో కొందరు తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది.