మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు: అమిత్ షా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. బెంగాల్లో ఆయన మాట్లాడుతూ మమత ప్రభుత్వం అన్నింటా విఫలమైందని మండిపడ్డారు.
బుర్ద్వాన్ పేలుళ్ల కేసు దర్యాప్తునకు మమతా బెనర్జీ అడ్డుపడుతున్నారని, శారదా గ్రూప్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతలదే ప్రధాన పాత్ర అని ఆరోపించారు. శారదాస్కాం నిందితులను మమత ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు మమతా ఆటంకం కల్పిస్తున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న వలసదారులకు మమతా బెనర్జీ రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. బెంగాల్ ప్రజల ఆకాంక్షలను తృణమూల్ కాంగ్రెస్ ఏమాత్రం నెరవేర్చడం లేదని అన్నారు. బెంగాల్కు ప్రధాని మోడీ నాయకత్వం అవసరమని ఆకాంక్షించారు.
బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ర్యాలీని అడ్డుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేక ప్రయత్నాలు చేపట్టింది. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టే ర్యాలీకి కోల్ కతా హైకోర్టు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది.
కాగా, భారతీయ జనతా పార్టీ చేపట్టిన ర్యాలీ వలన రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు తలెత్తడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలకు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తరుపున పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తరువాత... బీజేపి ర్యాలీకి అనుమతించాలి అంటూ మూడు సార్లు హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై గత శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు షరతులతో కూడిన అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా... బీజేపీ చేపట్టబోయే ర్యాలీ పర్యవేక్షణకు ముగ్గురు సభ్యుల కమిటీని హైకోర్టు నియమించింది.