జయలలితకు షాక్: కూటమికి శరత్కుమార్ ‘గుడ్బై’
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జయలలిత పార్టీకి తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ షాక్ ఇచ్చారు. జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి ఆయన గుడ్ బై చెప్పారు.
జయ కూటమిలో ఇన్నాళ్లు కొనసాగిన ఆల్ ఇండియా సమథువా మక్కల్ కచ్చి (ఏఐఎస్ఎంకె) పార్టీ అధినేత అయిన శరత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
'నేను కూటమిలో కొనసాగుతానని గతంలో హామీ ఇచ్చాను. ఆ మేరకు ఐదేళ్లు కూటమిలో కొనసాగాను. నా మాట నెరవేరింది. నేను అన్నాడీఎంకేను ఏమీ నిందించను. కానీ, ఈ ఐదేళ్ల గురించి సింహావలోకనం చేసుకుంటే మేం చేసిందాని కన్నా చాలా ఎక్కువ చేయాల్సి ఉండేది' అని శరత్ కుమార్ మీడియా మాట్లాడుతూ చెప్పారు.
కాగా, శరత్ కుమార్ పార్టీకి తనతోపాటు మరో ఎమ్మెల్యే ఉన్నారు. అయితే అన్నాడీఎంకేతో పొత్తు తెంచుకోవడంపై ఆగ్రహించిన శరత్ కుమార్ పార్టీలోని మరో ఎమ్మెల్యే ఎన్నావుర్ నారాయణ్ జయలలిత పార్టీకి అండగా నిలిచారు. దీంతో అతడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు శరత్ కుమార్.
దక్షిణ తమిళ జిల్లాల్లో బలంగా ఉన్న నాడర్ వర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న శరత్ కుమార్ త్వరలోనే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని ప్రకటించనున్నారు. తమిళ సినీ అసోసియేషన్ నడిగర్ ఎన్నికల వివాదంలో శరత్ కుమార్కు అన్నాడీఎంకే మద్దతు ఇవ్వకపోవడంతోనే ఆ పార్టీ కూటమికి ఆయన గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. అయితే శరత్ కుమార్ మాత్రం నడిగర్తో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు.