చెడిపోయిన ఆహారం సర్వ్ చేసినందుకు ఆ హోటల్కు కోర్టు షాక్.. ఎంత చెల్లించమందంటే..?
చెన్నై: గత కొద్దిరోజులుగా ప్రముఖ హోటల్ శరవణ భవన్ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆ హోటల్ యాజమానికి సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడం... ఆ తర్వాత శరవణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ హోటల్ పేరు వార్తల్లో బాగా వినిపించింది. తాజాగా కొంత గ్యాప్ తర్వాత మళ్లీ హోటల్ శరవణ పేరు వార్తల్లో నిలిచింది. సుప్రీంకోర్టు అడ్వకేట్కు ఆహారం వడ్డించేసమయంలో నరకయాతన చూపించడంతో ఆ హోటల్పై కన్స్యూమర్ కోర్టు కన్నెర్ర చేసింది.
2014లో అన్నాసలైలోని శరవణ హోటల్కు సుప్రీం కోర్టు అడ్వకేట్ సామి వెళ్లారు. అక్కడ ఆయన ఏదో ఆహారం ఆర్డర్ చేసుకుని తిన్నారు. అయితే ఆహారం తిన్న తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాదు అనారోగ్యంతో మానసికంగా చాలా వేదనకు గురైనట్లు కన్స్యూమర్ కోర్టుకు ఫిర్యాదు చేస్తూ ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందంటూ తన కంప్లెయింట్లో పేర్కొన్నారు. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 90 లక్షలు చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనకు సర్వ్ చేయబడ్డ భోజనంలో ముందుగా వెంట్రుకలు కనిపించాయని.. అయితే దీన్ని హోటల్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో మరో భోజనం అరేంజ్ చేశారని చెప్పారు. అయితే ఆ భోజనం భుజించిన తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి తనకు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్న అడ్వకేట్ సామి... ఆ తర్వాత వాంతులు, జ్వరం, శరీరంపై దురదలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత తాను ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు చెప్పాడు. అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని వైద్యులు తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే తనకు మురిగిపోయిన ఆహారం వడ్డించినందుకు గాను 60 లక్షలు ఇక మానసికంగా ఆవేదనకు గురిచేసినందుకు గాను రూ. 30 లక్షలు చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణ చేసిన న్యాయస్థానం శరవణ హోటల్ రూ. లక్ష చెల్లించాలని ఇదే న్యాయంగా ఉంటుందని భావించి చెబుతున్నట్లు జడ్జీ చెప్పారు. ఇక రూ.10వేలు లిటిగేషన్ ఛార్జీలు కింద చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.