సర్దార్జీ జోకులు అవమానం: ఓ మహిళా లాయర్ పిల్
న్యూఢిల్లీ: సర్దార్జీ జోకులు... తమ వర్గానికి అవమానం కలిగించే రీతిలో ఉంటున్నాయని, ఆన్లైన్ వెబ్ సైట్లలో ఉన్న శాంటా బాంటా తరహా సర్దార్జీ జోకులన్నింటినీ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓ సిక్కు మహిళా న్యాయవాది సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.
ఈ జోకుల కారణంగా తమ పిల్లలు పేరు వెనుక సింగ్, కౌర్ అనే పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సిక్కులు నిజంగానే అలా భావిస్తే గనుక ఈ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే హర్వీందర్ చౌదరి అనే న్యాయవాది సర్జార్జీ జోకులపై సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ ప్రజాహిత వ్యాజ్యం సుప్రీం కోర్టు సీజె టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఒక జోకు సిక్కులకు ఎలా అవమానకరమైందనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారని మహిళా న్యాయవాదిని అడిగారు. అంతేకాదు ''ఈ పిల్ విషయంలో మీ సామాజికవర్గం మీ వెనక ఉంటుందా'' అని ఆమెను ప్రశ్నించారు. అందుకు ఆమె ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్జీఎంసీ) కూడా ఈ విషయమై గతంలో ఒక పిటిషన్ను దాఖలు చేసినట్లు చెప్పారు.
ఈ కేసును వాదించేందుకు డీఎస్జీఎంసీ ప్రముఖ సీనియర్ న్యాయవాది రామ్జెఠ్మలానీని నియమించుకున్న విషయాన్ని ఆమె తెలిపారు. ఈ కేసులో ఆమె తన వాదనలు వినిపిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ధర్మాసనం అక్కడే ఉన్న అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ పట్వాలియాను ఉద్దేశించి 'ఒక సర్దార్జీగా దీనిపై మీ అభిప్రాయమేమిటి' అని ప్రశ్నించారు.
ఇంతలో ఆమె తన వాదనలను వినిపించడం మొదలుపెట్టారు. చివరకు ప్రొసిడింగ్స్ పూర్తైన తర్వాత పట్వాలియా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో డీఎస్జీఎంసీ పిటిషన్తో కలిపి ఈ కేసును విచారిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.