లైంగిక వేధింపులు: పటేల్ వర్సిటీ ప్రొఫెసర్పై కేసు
ఆనంద్: ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం (ఎస్పీయూ)కు చెందిన సైకాలజీ ప్రొఫెసర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఈ విశ్వవిద్యాలయంలో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న మహిళా రీసెర్చ్ స్కాలర్ మంగళవారం రాత్రి ఆనంద్ జిల్లాలోని వల్లభ్ విద్యానగర్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడైన ప్రొఫెసర్ యగ్నిక్పై ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందిత ప్రొఫెసర్ యగ్నిక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయనున్న ముందు రోజే అతనిపై కేసు నమోదైంది.
బాధిత మహిళ అంతకుముందు వేధింపుల విషయాన్ని విశ్వవిద్యాలయం అధికారులకు తెలిపింది. అయితే రిటైర్మెంట్ అవుతున్నాడనే ఉద్దేశంతో వారు నిందిత ప్రొఫెసర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోకుండా.. అతడి స్వచ్ఛంద విరమణకు అధికారులు అవకాశం కల్పించడటం పట్ల విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం మండిపడింది.
ఈ నేపథ్యంలో బాధిత మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్, రాష్ట్ర విద్యాశాఖ అధికారులను కలిసి విషయాన్ని తెలియజేసింది. నిందిత ప్రొఫెసర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. కాగా, నిందిత ప్రొఫెసర్పై కేసు నమోదు చేశామని డిఎస్పీ ఏఎం పటేల్ తెలిపారు. తదుపరి విచారణ కోసం బాధితురాలు, నిందితుడు, మహిళా విభాగం, యునివర్సిటీ అధికారుల నుంచి దీనిపై సమాచారం సేకరిస్తామని చెప్పారు.