టీటీవీ దినకరన్ దూకుడుకు మన్నార్ గుడి మాఫియా కళ్లెం: అదే జరిగితే, శశికళకు ఫిర్యాదు!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ ఫ్యామిలీలో మళ్లి రచ్చ మొదలైయ్యింది. జయలలిత ప్రాతినిధ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయ్యి జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్ దూకుడుకు కళ్లెం వెయ్యాలని మన్నార్ గుడి మాఫియా సిద్దం అయ్యింది. ఇప్పటికే బెంగళూరు జైల్లో శశికళను కలిసి ఫిర్యాదు చేశారని వెలుగు చూసింది.
శశికళతో వేర్వేరుగా భేటీ
ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ నటరాజన్ ను ఆమె కుటుంబ సభ్యులు వేర్వేరుగా భేటీ అవుతున్నారు. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శశికళతో చర్చలు జరిపారని సమాచారం.
దినకరన్ దూకుడు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత టీటీవీ దినకరన్ దూకుడు పెంచారు. తమిళనాడు ప్రభుత్వం మీద గతంలోకంటే ఇప్పుడు ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు. వీలుచిక్కినప్పుడు దినకరన్ అనుచరులు డీఎంకే పార్టీ నాయకులతో కలిసి పని చేస్తున్నారు.
దినకరన్ వర్గం ఔట్
అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం పూర్తిగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం చేతికి వెళ్లిపోయింది. అన్నాడీఎంకేలో ఉంటూ దినకరన్ కు మద్దతు ఇస్తున్న వారిని పళనిస్వామి, పన్నీర్ సెల్వం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు.
దినకరన్ కొత్త పార్టీ!
అన్నాడీఎంకేలోని తన వర్గంలోని నాయకులను వరుసగా పార్టీ నుంచి బహిష్కరించడంతో కొత్త పార్టీ పెట్టి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యాలని టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే టీటీవీ దినకరన్ ఇంత వరకూ కొత్త పార్టీ విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేదు.
మన్నార్ గుడి వ్యతిరేకం
టీటీవీ దినకరన్ కొత్త పార్టీ పెట్టడాన్ని మన్నార్ గుడి మాఫియా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే లేనిపోని సమస్యలు ఎదురయ్యాయి, ఇప్పుడు దినకరన్ కొత్త పార్టీ పెడితో ఎక్కడలేనిపోని సమస్యలు వచ్చి నెత్తిన పడతాయో అంటూ మన్నార్ గుడి మాఫియా సభ్యులు ఆందోళన చెందుతున్నారు
శశికళకు ఫిర్యాదు
శశికళకు ఇప్పటికే ఆమె వదిన ఇళవరసి కుటుంబ సభ్యులు టీటీవీ దినకరన్ తిక్క చేష్టల గురించి ఫిర్యాదు చేశారని తెలిసింది. శశికళ వారిచండం వలనే టీటీవీ దినకరన్ కొత్త పార్టీ పెట్టే విషయంలో ఆలోచనలో పడ్డారని సమాచారం.