ముహూర్తం ఖరారు: తమిళనాడు సిఎం పీఠంపై శశికళ
చిన్నమ్మ శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. ఈ నెల 12వ తేదీన ఆమె సిఎం పదవి చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
చెన్నై: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు చిన్నమ్మ శశికళ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ పగ్గాలను అత్యంత సాఫీగా చేతుల్లోకి తీసుకున్న శశికళ అంతే సాఫీగా ప్రభుత్వాధినేతగా ముందుకు రావడానికి వ్యూహరచన చేసుకున్నట్లు తెలుస్తోంది.
పన్నీరు సెల్వం కూడా శశికళ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయన దాదాపు ప్రతిరోజు ఆమె వద్ద హాజరు వేయించుకుంటున్నారు. ఓ వర్గం శశికళను సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రిని చేయాలలని ఒత్తిడి పెంచుతోంది. తంబిదురై వంటి నాయకులు కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు.
తంబిదురైకి మంత్రులు ఆర్పీ ఉదయ కుమార్, కడంబూరు రాజా సేవూరు రామచంద్రన్ తదితరులు సహకరిస్తున్నారు.. కొత్త సంవత్సరం రోజున అమ్మ జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత మంత్రులు శశికళను కలుసుకుని ముఖ్యమంత్రి బాద్యతలను చేపట్టాలని కోరారు.
ఈ స్థితిలో శశికళ ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకు గాను జిల్లాలవారీగా తీర్మానాలు చేస్తూ శశికళను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరనున్నారు. ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ నెల 17వ తేదీన పెద్ద యెత్తున ఎంజిఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.