బెంగళూరు జైళ్లో శశికళకు సినిమా కష్టాలు: అదే ఫుడ్, దోమల బెడద, నిద్రలేక !
బెంగళూరు పరప్పన అగ్రహార జైళ్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఖైదీలకు ఇచ్చే భోజనం తింటున్నారని, ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని, దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారని, నిద్రపోవడానికి నానా తంటాలు .
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నాటరాజన్ ను బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో సాధారణ ఖైదీగానే చూస్తున్నామని, ఆమెకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని కర్ణాటక జైళ్ల శాఖ ఐజీ వీరభద్రస్వామి అంటున్నారు.
బెంగళూరులో తనను కలిసిన విలేకరలతో కర్ణాటక జైళ్ల శాఖ ఐజీ వీరభద్రస్వామి మాట్లాడుతూ శశికళకు జైల్లో సాధారణ ఖైదీలకు పెట్టే భోజనం మూడు పూటల అందిస్తున్నామని, ఆ ఆహారం ఆమె కష్టపడి తింటున్నారని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేక సదుపాయాలు అంటూ ఏమీ లేవు
బెంగళూరు పరప్పన అగ్రహారజ జైలులో ఉన్న శశికళకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని, సాదారణ ఖైదీలకు కల్పించే సదుపాయాలు మాత్రమే కల్పించామని, అందులో ఎలాంటి సందేహం లేదని ఐజీ వీరభద్రస్వామి అన్నారు.
శశికళకు ఇంటి భోజనం
ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఇంటి భోజనం ఇవ్వడం లేదని ఐజీ వీరభద్రస్వామి చెప్పారు. అయితే శశికళను కలవడానికి వస్తున్న వారు ఆమెకు పండ్లు ఇస్తున్నారని, అవి తీసుకుని ఆమె తింటున్నారని ఐజీ వీరభద్రస్వామి వివరించారు.
చిన్నమ్మ నిద్రపోవడం లేదు
పరప్పన అగ్రహార జైల్లో శశికళకు దోమల బెడదతో నిద్రపట్టడం లేదని, నిద్రపోవడానికి ఆమె చాల బాధపడుతున్నారని అక్కడి సిబ్బంది తనకు సమాచారం ఇచ్చారని కర్ణాటక జైళ్ల శాఖ ఐజీ వీరభద్రస్వామి చెప్పారు.
ఎవ్వరూ అడగలేదు, అడిగినా ఇవ్వం
ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని, వారు ప్రత్యేక సదుపాయాలు కావాలని మమ్మల్ని వారు అడగలేదని, అడిగినా తాము ప్రత్యేక సదుపాయాలు కల్పించమని ఐజీ వీరభద్రస్వామి అన్నారు.
కర్ణాటక జైళ్ల శాఖ నియమాలు
కర్ణాటక జైళ్ల శాఖ నియమాల ప్రకారం తాము ఖైదీలకు సదుపాయాలు కల్పిస్తామని, న్యాయస్థానం ఆదేశాలు లేకుండా ఎవ్వరికి ఎలాంటి సదుపాయాలు కల్పించమని, కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ఖైదీలు ఎవరికైన ప్రత్యేక సదుపాయాలు కల్పించారని వెలుగు చూస్తే అక్కడి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ ఐజీ వీరభద్రస్వామి స్పష్టం చేశారు.