శశికళ ప్లాన్ రివర్స్: జైల్లో మరో గదికి, తమిళనాడు వెళ్లాలని ! ఎందుకంటే ?
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో తనపై దాడి జరిగే అవకాశం ఉందని, వెంటనే తమిళనాడు జైలుకు తరలించాలని శశికళ కోర్టులో అర్జీ సమర్పించడానికి ప్రయత్నాలు చెయ్యడానికి సిద్దం కావడంతో అలాంటి చాన్స్ .
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను శుక్రవారం మరో గదిలోకి మార్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శశికళకు ప్రాణహాని ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
పరప్పన అగ్రహార జైల్లో మహిళా ఖైదీలు ఉంటున్న బ్యారెక్ మొదటి అంతస్థులోని గదిలో శశికళ ఉన్నారు. ఆమె పక్క గదిలో సీరియల్ కిల్లర్, ఉరిశిక్షకు గురైన సైనెడ్ మల్లిక ఉంటున్నది. శశికకు ప్రాణహాని ఉందని వెలుగు చూడటంతో తమిళ భాష అర్థం కాని 10 మంది మహిళా పోలీసులు అక్కడ భద్రత కల్పిస్తున్నారు.
శశికళకు ఆ చాన్స్ ఇవ్వకూడదని
తనపైన దాడి జరిగే అవకాశం ఉందని, తనను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి తమిళనాడు జైలుకు తరలించాలని శశికళ న్యాయస్థానంలో అర్జీ సమర్పించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. అలాంటి చాన్స్ శశికళకు ఇవ్వకుండా ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
సామాన్య ఖైదీలతో ఉంటే సమస్యే
శశికళను సామాన్య ఖైదీలతో పాటు ఇక్కడే పెడితే సమస్యలు వస్తాయని జైళ్ల శాఖ అధికారులు గుర్తించారు. శశికళను వేరే గదికి మార్చాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం ఆమెను ప్రత్యేక గదికి తరలిస్తున్నామని జైలులోని ఒక అధికారి ఓ కన్నడ దినపత్రికకు చెప్పారు.
తమిళనాడు వెళ్లాలని శశికళ ఆలోచన
తాను సూచించిన ఎడప్పాడి పళనిసామి తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడు శశికళ తమిళనాడులోని అన్ని సదుపాయాలు ఉన్న జైలుకు వెళ్లాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని సమాచారం. గురువారం ముగ్గురు న్యాయవాదులు జైలులో శశికళతో పలు విషయాలపై చర్చించారు.
మేమూ కోర్టుకు వెలుతాం
పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ తమిళనాడు జైలుకు వెళ్లడానికి ప్రయత్నిస్తే తాము కోర్టును ఆశ్రయిస్తామని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు. పరప్పన అగ్రహార జైల్లో శశికళకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని ఇక్కడ ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని, ఆమెను ఇదే విషయంపై తమిళనాడుకు పంపిస్తే కర్ణాటకకు చెడ్డ పేరు వస్తుందని కోర్టులో చెబుతామని అంటున్నారు.
అన్ని సౌకర్యాలు ఉండాలని
తమిళనాడులో తన కనుసైగలతో నడుస్తున్న ప్రభుత్వం ఉందని, తాను తమిళనాడు జైలుకు వెలితే ఎలాంటి సమస్యలు లేకుండా లగ్జరీగా జైలు శిక్ష అనుభవించవచ్చని శశికళ ప్లాన్ వేశారని సమాచారం. అయితే అలాంటి చాన్స్ ఇవ్వకుండా జైళ్ల శాఖ అధికారులు ఆమెను ప్రత్యేక గదికి తరలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయ్యాలని నిర్ణయించారు.
మొండికేసిన శశికళ
ఖైదీలతో పాటు భోజనం తినడానికి శశికళ మొదట నిరాకరించారు. అయితే మధుమేహ వ్యాదితో బాధపడుతున్న శశికళను ఆమె వదిన ఇళవరసి ఒప్పించి బయటకు తీసుకు వచ్చారు. శశికళ చపాతి, మజ్జిగ అన్నం తిన్నారని, సాయంత్రం టీ తాగారని జైలు అధికారులు ఓ కన్నడ దినపత్రికకు చెప్పారు.