అమ్మ సమాధి వద్ద ధర్నాకు శశికళ రెడీ: "బెదిరిస్తున్నారా?"
సిఎం కుర్చీ దూరం అవుతుండడంతో శశికళ అసహనంతో రగలిపోతున్నారు. ఆమె అమ్మ సమాధి వద్ద ధర్నాకు సిద్ధవుతున్నట్లు తెలుస్తోంది.
చెన్నై: ముఖ్యమంత్రి పీఠం రోజు రోజుకూ దూరం అవుతుండడంతో చిన్నమ్మ శశికళలో అసహనం చోటు చేసుకుంటోంది. బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్మెంట్ కోరిన శశికళ మరోవైపు ధర్నాకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అమ్మ జయలలిత స్మారకం వద్ద ధర్నాకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. జయ మెమోరియల్కు కొద్ది సేపటికే శశికళ బయలుదేరారు. అక్కడకు చేరగానే తన మద్దతుదారులతో కలిసి ధర్నాలో పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.
ఇదిలావుంటే, తనకు పూర్తి మెజారిటీ ఉందని అంటూ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని శశికళ గవర్నర్ను డిమాండ్ చేయడంపై రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ ఘాటుగా స్పందించారు. శశికళ గవర్నర్నే బెదరిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారా అని అడిగారు. ఈ విషయంపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు మంత్రి ఒకరు తాజాగా - ప్రజా తీర్పును గౌరవిస్తామని సంచలన ట్వీట్ చేశారు. 'ఓటర్ల మనోభావాలను అర్థం చేసుకుంటాం. పార్టీలో చీలికలు రాకుండా ఐకమత్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం' అని ట్విట్టర్ వేదికగా విద్యాశాఖ మంత్రి పాండియరాజన్ వ్యాఖ్యానించారు.
విద్యాశాఖమంత్రి పాండ్య రాజన్ సీఎంకు మద్దతు తెలపటంతో ఆమె పన్నీర్ సెల్వంపై విరుచుకుపడ్డారు. అమ్మ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీలో చీలిక తేవాలని చూస్తున్నాడని ఆమె పన్నీర్ సెల్వంపై మండిపడ్డారు.