వేరే జైలుకు సీరియల్ కిల్లర్ సెనైడ్ మల్లిక: శశికళే కారణమా?
సీరియల్ కిల్లర్ సైనేడ్ మల్లిక అలియస్ కేడీ కెంపమ్మను పరప్పన అగ్రహార జైలు నుంచి బెలగాలిలోని హిందాల్గా జైలుకు తరలించారు. భద్రతా కారణాలు చూపుతూ ఆమెను గత వారమే ఈ జైలుకి షిఫ్ట్ చేశారు.
చెన్నై/బెంగళూరు: సీరియల్ కిల్లర్ సైనెడ్ మల్లిక అలియస్ కేడీ కెంపమ్మను పరప్పన అగ్రహార జైలు నుంచి బెలగాలిలోని హిందాల్గా జైలుకు తరలించారు. భద్రతా కారణాలు చూపుతూ ఆమెను గత వారమే ఈ జైలుకి షిఫ్ట్ చేశారు. వేరే జైలుకి తరలించే విషయమై మల్లికకు ఎటువంటి ముందస్తు సమాచారం జైలు అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం.
ఉన్నపళంగా, లగేజ్ సర్దుకోవాల్సిందిగా అధికారులు ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను తరలించిన జైలు దేశంలోనే పురాతన జైళ్లలో ఒకటి. ఈ జైలులో హత్యా నేరం కింద ఉన్న ఖైదీల సంఖ్యే ఎక్కువగా ఉంది.
అయితే, సైనేడ్ మల్లికను ఉన్నపళంగా ఇక్కడి నుంచి తరలించడానికి ప్రధాన కారణం అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళే కారణంగా తెలుస్తోంది. శశికళతో మల్లిక చనువుగా ఉండటమే దీనిక కారణంగా తెలిసింది.
శశికళ ఈ జైలుకు వచ్చినప్పటి నుంచి సైనేడ్ మల్లిక ఆమెతో చాలా సన్నిహితంగా ఉంటోందని జైలు అధికారులు అంటున్నారు. భోజనం కోసం శశికళను 'క్యూ'లో నిలబడనిచ్చేది కాదని, ఆమె దగ్గరికే భోజనం తీసుకువెళ్లి మల్లిక ఇచ్చేదని చెబుతున్నారు. దీంతో, జైలు అధికారులు అప్రమత్తమయ్యారని, ఈ నేపథ్యంలోనే మల్లికను హిందాల్గా జైలుకు తరలించారని తెలిసింది. కాగా, మల్లిక.. పలు హత్య కేసుల్లో నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.