శశికళకు జైల్లోనే రాజభోగాలు: అధికారులకు భారీ మొత్తంలో లంచం!
ఇప్పటికే జైలుపాలైన శశికళకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగుచూసింది. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార కారాగారంలో ఆమె శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
చెన్నై/బెంగళూరు: ముఖ్యమంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకుని జైలుపాలైన శశికళకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగుచూసింది. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార కారాగారంలో ఆమె శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా పేరున్న శశికళకు అక్కడ రాజభోగాలు అందుతున్నాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపా మౌద్గిల్ ఉన్నతాధికారులకు లేఖ రాయడం గమనార్హం.
జైల్లోనే రాజభోగాలు
కారాగార శాఖలోని సీనియర్ అధికారి ఒకరు ఆమె నుంచి రూ.2 కోట్ల నగదును తీసుకుని సకల సదుపాయాలూ కల్పించారని డీఐజీ తెలిపారు. అంతేగాక, శశికళకు ప్రత్యేక వంటగది, ఆమె గదిలో పరుపులు, స్వేచ్ఛగా తిరిగేందుకు వసతులు సమకూర్చారంటూ కారాగారంలో జరుగుతున్న అక్రమాలపై కర్ణాటక పోలీసు డైరక్టర్ జనరల్ రూప్ కుమార్ దత్తకు ఫిర్యాదు చేశారు.
మసాజ్ చేసేందుకూ...
నకిలీ స్టాంపు కాగితాలను ముద్రించి విక్రయిస్తూ దొరికిపోయిన తెల్గీ ఇదే కారాగారంలో ఒకటిన్నర దశాబ్దం నుంచి శిక్షను అనుభవిస్తున్నాడని.. బ్యారెక్లోనే తెల్గీకి మసాజ్ చేసేందుకు ఎప్పుడూ నలుగురు ఖైదీలు సిద్ధంగా ఉంటారని డీఐజీ పేర్కొన్నారు. కారాగారంలోకి నిత్యం గంజాయి సరఫరా చేస్తున్నారని తెలిపారు.
ఖైదీలకు పూర్తి స్వేచ్ఛ..
కారాగారంలోకి ఫోన్లు, సిమ్కార్డులు వెళుతున్నాయని డీఐజీ తెలిపారు. నేరం చేసిన వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు కారాగారంలో శిక్షను విధిస్తారని చెప్పారు. కానీ, ఒక వైద్యునిపై నాగేంద్ర ప్రసాద్ అనే ఖైదీ దాడి చేసి గాయపరిచాడని తెలిపారు. ఇక్కడి కారాగారంలో ఖైదీలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలిచ్చినట్లుందని ఆమె తన లేఖలే పేర్కొన్నారు. తాను బాధ్యతల్ని చేపట్టిన తరువాత కారాగారంలో చేసిన తనిఖీల్లో ఈ అంశాలను గుర్తించినట్లు ఆమె తెలిపారు.
నిజం లేదంటూ...
డీఐజీ రూప చేసిన ఆరోపణలను కారాగారాల శాఖ ఏడీజీపీ సత్యనారాయణ రావు ఖండించారు. తానేమీ శశికళ తరుఫు ప్రతినిధుల నుంచి లంచం తీసుకోలేదని, ఆ ఆరోపణల్లో నిజం లేదని బుధవారం రాత్రి ఇక్కడ తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులతో ఆయన వివరించారు. అయితే, ఇందులో నిజం ఎంతో తేలాలంటే విచారణ జరిపితే గానీ తెలియదు. మరి ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటే గానీ.. అసలు నిజాలు బయటికి రావు.