శశికళ వచ్చే జనవరిలోనే జైలు నుంచి విడుదల!: రూ. 10 కోట్ల జరిమానా చెల్లింపు
బెంగళూరు: అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ. 10 కోట్ల జరిమానాను అన్నాడీఎంకే మాజీ నేత, తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ చెల్లించారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళ తరపున ఆమె న్యాయవాదులు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు.
బెంగళూరు సిటీ సివిల్ కోర్టు కార్యాలయంలో డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా ఈ మొత్తాన్ని అందజేసినట్లు సమాచారం. కాగా, ఈ మొత్తాన్ని ఓ రాజకీయ నేత ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అక్రమార్జన కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే, సత్ ప్రవర్తన తదితర కారణాల వల్ల జనవరి 27నే ఆమెను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలను కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
కాగా, ఈ కేసులో శశికళతోపాటు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు. జయలలితకు రూ. 100 కోట్లు, శశికళ సహా ఇతరులకు రూ. 10 కోట్లు జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబరులో ట్రయల్ కోర్టు తీర్పును ఇచ్చింది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో శశికళ జైలు నుంచి విడుదల కావడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారనుంది. రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయోననేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నీడీఎంకే మళ్లీ శశికళ చేతుల్లోకి వెళుతుంగా.. లేక ప్రస్తుత సీఎం పళనిస్వామి, పన్నీరు సెల్వంల నేతృత్వంలోనే ఉంటుందా? అని ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది.