సిఎం పీఠంపై శశికళ ఆశలు గల్లంతు: రంగంలోకి మేనల్లుడు
ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే శశికళ ఆశలు గల్లంతు కావడంతో తన మేనల్లుడు దీపక్ను రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
చెన్నై: సుప్రీంకోర్టుతో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే అన్నాడియంకె చీఫ్ శశికళ నటరాజన్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తన మేనల్లుడు దీపక్ను రంగంలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఇప్పటికే ఆమె ముగ్గురు పేర్లను ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రతిపాదించారు.
సెంగోట్టయ్యన, ఎడప్పాడి పళనిస్వామి, తంబిదురై పేర్లను శశికళ ప్రతిపాదించారు. ఈ ముగ్గురి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే తన మేనల్లుడు దీపక్కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఆమె ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
శశికళను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు ఆమెకు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఆమె జైలుకు వెళ్తే తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరనేదానిపై అన్నాడీఎంకేలో చర్చ జరుగుతోంది. పన్నీర్ సెల్వం శిబిరం ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఆయనకు అధికారం దక్కకుండా చేసే వ్యూహాన్ని శశికళ రూపొందించినట్లు చెబుతున్నారు.
నిజానికి, సోమవారంనాడు గోల్డెన్ బే రిసార్ట్స్లోనే బస చేసిన శశి ఇదే అంశంపై అనుచర ఎమ్మెల్యేలతో చర్చించారు. తీర్పు ప్రతికూలంగా వస్తే తాను ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలు అయితే ఏం చేయాలనే విషయంపై ఆమె సుదీర్ఘంగా చర్చించినట్లు చెబుతున్నారు.
తాను కానిపక్షంలో ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనే అంశంపై ముఖ్య ఎమ్మెల్యేలతో ఆమె చర్చించారు. అంతర్గతంగా ముగ్గురు పేర్లను ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. అయితే, ఆమె మనసులో మాత్రం దీపక్కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఉన్నట్లు చెబుతున్నారు.