జయలలిత మృతి: దోబూచులాడతారెందుకు? శశికళపై విచారణ కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు!
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్.. జయలలిత నెచ్చెలి శశికళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జయలలిత మృతిపై తన ప్రమాణ పత్రం దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలంటూ శశికళ పెట్టుకున్న పిటిషన్ను తిరస్కరించింది. అంతేకాదు, కమిషన్తో శశికళ దోబూచులాడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
దివంగత సీఎం జయలలిత మరణంపై మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుముగసామి నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 22 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు గడువు పొడిగించినప్పటికీ శశికళ తన ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయలేదు.
స్వయంగా జైలుకొస్తాం.. శశికళకు హెచ్చరిక
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఆమె నెచ్చెలి శశికళ ప్రమాణపత్రం దాఖలు చేయకుంటే ఈసారి స్వయంగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వచ్చి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని.. జయ మృతిపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ మంగళవారం శశికళను హెచ్చరించింది. ఈలోగా శశికళ ప్రమాణ పత్రం కనుక దాఖలు చేయకుంటే ఆమెపై ‘ప్రతికూల అభిప్రాయం' ఏర్పరచుకోవలసి ఉంటుందని కూడా జస్టిస్ అరుముగసామి హెచ్చరించారు.
శశికళ అభ్యర్థన, కమిషన్ తిరస్కరణ...
అంతకుముందు జనవరి 30 విచారణ సమయంలో ఏకసభ్య కమిషన్ న్యాయమూర్తి జస్టిస్ అరుముగసామి శశికళను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘శశికళ తనంత తానుగా మొత్తం నిజాన్ని చెప్పాలనుకోవడం లేదు..' అని న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై శశికళ స్పందిస్తూ.. కమిషన్ చేసిన వ్యాఖ్యలు తనపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున, ఆ వ్యాఖ్యలను కొట్టివేయాంటూ అభ్యర్థించారు. అయితే శశికళ అభ్యర్థనను న్యాయమూర్తి అరుముగసామి తిరస్కరించారు.
నిజాలు వెల్లడించడం ఇష్టం లేనట్లుగా ఉంది...
ఈ సందర్భంగా జస్టిస్ అరుముగసామి మాట్లాడుతూ.. ‘నవంబర్ 22 నుంచి ఇప్పటి వరకు శశికళ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయడంలో విఫలమయ్యారు. ఐదుసార్లు గడువు పొడిగించినా... మళ్లీ మరింత సమయం ఇవ్వాలంటూ ఆమె పదేపదే దరఖాస్తు పెట్టుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే.. జయలలితకు చికిత్స మాటున ఏం జరిగిందన్న అంశంపై వివరాలు వెల్లడించడం ఆమెకు ఇష్టం లేనట్టు అనిపిస్తోంది..' అని వ్యాఖ్యానించారు.
సిద్ధం చేస్తున్నాం, సోమవారానికల్లా...
మరోవైపు శశికళ తరపు న్యాయవాది.. ప్రస్తుతం జయ మృతి కేసులో శశికళ అఫిడవిట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నామని, శుక్రవారం నాటికి ఆమెతో సంతకం చేయించి సోమవారానికల్లా జస్టిస్ అరుముగసామి కమిషన్కు సమర్పిస్తామని పేర్కొన్నారు. అందుకే ఈసారి కేవలం ఏడు రోజుల గడువు మాత్రమే తాము కోరామని శశికళ తరపు న్యాయవాది తెలిపారు.