నెట్లో శశికళ అశ్లీల ఫోటోలు: అన్నాడీఎంకె నేతల పనే అంటూ ఫిర్యాదు!
శశికళ పుష్ప ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని, సైబర్ సెల్ దీనిపై దర్యాప్తు జరుపుతుందని క్రైం విభాగానికి చెందిన డీసీపీ వెల్లడించారు.
చెన్నై: రాజకీయ పార్టీలన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టిన తర్వాత.. ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ప్రత్యర్థుల మీద విష ప్రచారం చేయడం కూడా ఇందులో భాగంగానే జరుగుతోంది.
తాజాగా తమిళ రాజకీయాల్లోను ఇలాంటి దుస్థితే నెలకొందంటున్నారు అన్నాడీఎంకె బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప. తన వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల రీతిలో ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తున్నారని ఎంపీ పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకెకు చెందినవారే ఈ చర్యకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
శశికళ పుష్ప ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని, సైబర్ సెల్ దీనిపై దర్యాప్తు జరుపుతుందని క్రైం విభాగానికి చెందిన డీసీపీ వెల్లడించారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో.. శశికళ పుష్పను దివంగత సీఎం జయలలిత అప్పట్లో పార్టీ నుంచి బహిష్కరించారు.
అమ్మ మరణానికి కారణం ఆమె నెచ్చెలి శశికళే అంటూ శశికళ పుష్ప చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఆమె మరణంపై సీబీఐతో విచారణ జరిపించాలని రాజ్యసభలోను డిమాండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కోసం జరిగిన ఎన్నికలో.. తాను రేసులో ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.