అంతా రివర్స్, శశికళకు ఓటమి భయమా?: రెచ్చిపోయి.. పుష్ప భర్తపై దాడి వెనుక!
జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకే పార్టీలో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా, బుధవారం నాడు దాడి వరకు వెళ్లింది.
చెన్నై: జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకే పార్టీలో గొడవలు జరుగుతున్నాయి. వారసత్వ పోరులో శశికళ నటరాజన్ ముందున్నారు. శశికళ నాయకత్వాన్ని రాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప, జయ కోడలు దీపా జయకుమార్ తదితరులు వ్యతిరేకిస్తున్నారు.
తొలుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చిన్నమ్మకు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించినా ఆ తర్వాత ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. శశికళ ముఖ్యమంత్రి పీఠం పైన కన్నేయడంతో పన్నీరు సెల్వం యూ టర్న్ తీసుకున్నారు.
నిన్నటి దాకా అంతర్గత పోరు..
శశికళకు పార్టీ అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టేందుకు పన్నీరు సెల్వం సహా పలువురు సీనియర్ నేతలు, మంత్రులు ఒకే చెప్పారు. ఆ తర్వాత ఆమెకు ఎదురు తిరగడం ప్రారంభమైంది. నిన్నటి దాకా పార్టీలో అంతర్గత పోరు కనిపించింది. బుధవారం నాడు ఆ అంతర్గత పోరు పెల్లుబుకింది. ఏకంగా దాడి వరకు వెళ్లింది.
తొలి నుంచి శశికళకు వ్యతిరేకమే
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప తొలి నుంచి శశికళ నటరాజన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు ఆమె కోర్టు దాకా వెళ్లారు. శశికళను పార్టీ చీఫ్గా ఎన్నుకునే అవకాశం ఇవ్వవద్దని ఆమె శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
అన్ని విధాలుగా అడ్డుకునే ప్రయత్నం
ఇందుకోసం శశికళ పుష్ప అన్నివిధాలుగా ముందుకు వెళ్తున్నారు. చట్టపరంగా ఆమె ఎన్నికను అడ్డుకునేందుకు కోర్టుకెక్కారు. అక్కడా కుదరకుంటే... అనే ఆలోచన రాగానే శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోకుండా చేసేందుకు ఆమె కూడా పార్టీ అధినేత్రి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.
కార్యాలయం ఎదుటే దాడి
ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు శశికళ పుష్ప భర్త, ఆమె లాయర్ పైన అన్నాడీఎంకే కార్యాలయం ఎదుట దాడి జరిగింది. అమ్మ జయలలిత తర్వాత చిన్నమ్మ శశికళనే అన్నాడీఎంకే కార్యకర్తలు కోరుకుంటున్నారా? లేక తనకు పోటీగా ఎవరూ ముందుకు రాకుండా శశికళ ప్లాన్గా ముందుకెళ్తున్నారా? అందులో భాగంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చునని అంటున్నారు. పై స్థాయి నేతలు శశికళను కోరుకంటున్నప్పటికీ.. కిందిస్థాయిలో ఆమెను కోరుకోవడం లేదనే వాదనలు ఉన్నాయి.
పార్టీ ఎన్నికకు ముందు షాక్
రేపు (గురువారం) శశికళను పార్టీ చీఫ్గా ఎన్నుకునేందుకు సిద్ధమవుతోంది. తాను ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని శశికళ కోరుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు. లేదా, పన్నీరు సెల్వం సహా తొలుత మద్దతిచ్చిన వారు ఇప్పుడు దూరమవుతుండటంతో ఓటమి భయంతో శశికళ ఉన్నారా అనే చర్చ సాగుతోంది.
పోటీ చేస్తే నష్టమేంటి?
శశికళ పుష్ప.. శశికళ పైన పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పత్రాలు సమర్పించేందుకు రాగా ఆమె భర్త, లాయర్ పైన దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. శశికళ పుష్ప పోటీ చేసినా మెజార్టీ మద్దతు ఉంటే శశికళ పార్టీ చీఫ్గా ఎన్నికవుతారు. కానీ శశికళ వర్గం ఆవేశానికి పోయి దాడికి పాల్పడ్డారని అంటున్నారు. తన భర్త, లాయర్ పైన దాడి విషయమై శశికళ పుష్ప తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడ్డ వారికి శిక్ష పడేలా చేస్తానని సవాల్ చేశారు.