అన్నాడీఎంకేలో శశికళ రీ ఎంట్రీ.. పన్నీర్ సెల్వం ఆసక్తికర వ్యాఖ్యలు, తమిళ రాజకీయాల్లో ట్విస్ట్
తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ లోకి ఆ పార్టీ బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ రీ ఎంట్రీ పై పార్టీ కో ఆర్డినేటర్ మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వికె శశికళను తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ హైకమాండ్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం నేత ఓ పన్నీర్సెల్వం సోమవారం అన్నారు.
శశికళను పార్టీలో చేర్చుకోవటంపై పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు
శశికళ తిరిగి అన్నాడీఎంకే లో చేరాలనుకుంటే దానిపై పార్టీ అధిష్టానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్న ఆయన రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా చేయవచ్చు, ఏ పార్టీ నుంచి అయినా వెళ్లిపోవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునే విషయంపై సానుకూల స్పందన వ్యక్తం చేసిన పన్నీర్ సెల్వం ఈ అంశంపై పార్టీ నేతలు చర్చించాలి అంటూ కొత్త చర్చకు తెరతీశారు.
అన్నాడీఎంకే ‘జనరల్ సెక్రటరీ'గా ఫలకాన్ని ఆవిష్కరించిన శశికళపై అన్నాడీఎంకే ఫిర్యాదు
అన్నాడీఎంకే 'జనరల్ సెక్రటరీ'గా తనను తాను ప్రకటించుకుంటూ శశికళ ఒక ఫలకాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ వ్యవస్థాపకులైన ఎం.జి.రామచంద్రన్ మెమోరియల్ వద్ద ఈ ఫలకాన్ని ఆవిష్కరించిన శశికళ పై అన్నాడీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే శశికళపై మోసపూరితంగా ప్రకటనలు చేయడం, అసమ్మతి, శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, భయాందోళన కలిగించే ఉద్దేశ్యంతో ప్రకటనలను ప్రసారం చేయడం కోసం చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో పోలీసులు ఎఫ్ఐ ఆర్ నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగ శశికళ పదవిపై సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నపుడు శశికళపై చర్యలు తీసుకునేందుకు వీలుండదని ఆమె న్యాయవాది చెప్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్ష
తమిళనాడులో అత్యంత శక్తివంతమైన మహిళ , అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలితతో శశికళకు అనుబంధం ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం, చెన్నైలోని ఒక ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత డిసెంబర్ 5, 2016 న మరణించినప్పుడు అన్నాడీఎంకేపై శశికళ ఆధిపత్యం మొదలుపెట్టింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు 2017 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేయడంతో శశికళ జీవితం ఒక్కసారిగా పెద్ద మలుపు తిరిగింది.
శశికళ రాకతో అన్నా డీఎంకేలో ఆధిపత్య పోరు
జనవరి 27న బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించిన శశికళ అధికారికంగా విడుదలయ్యారు. పార్టీలో తన హక్కును మళ్ళీ ప్రకటించుకునేందుకు ఆమె ప్రయత్నించారు. తాజాగా ఆమె ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటూ ఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సంఘటన అక్టోబర్ 17 న, అన్నాడీఎంకే వ్యవస్థాపక స్వర్ణోత్సవం జరిగిన రోజు, శశికళ, తన మద్దతుదారులతో కలిసి, ఫలకాన్ని ఆవిష్కరించడానికి పార్టీ వ్యవస్థాపకుడు ఎం జి రామచంద్రన్ (MGR) స్మారకానికి వెళ్లారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు నడుస్తుంది.
Recommended Video
శశికళ పట్ల పన్నీర్ సెల్వం సానుకూల ధోరణి .. తమిళనాట హాట్ టాపిక్
కీలక నాయకుడు పన్నీర్ సెల్వం బహిష్కృత నేత శశికళ పై సానుకూల ధోరణి కనబరచడం అన్నాడీఎంకే వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇటీవల పన్నీర్ సెల్వం భార్య విజయలక్ష్మి మరణించిన సమయంలో శశికళ సంతాపాన్ని తెలిపారు. పన్నీర్ సెల్వం చేతులు పట్టుకొని శశికళ ఓదార్చారు. ఇక తాజాగా మధురైలో మీడియాతో మాట్లాడిన పన్నీర్ సెల్వం శశికళ విషయంలో చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.