మోడీ ఎఫెక్ట్: శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఐటీ శాఖ షాక్, బెంగళూరు నుంచి దినకరన్ పరుగో పరుగు !
తమిళనాడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవ్వరూ ఊహించనట్లుగా ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
Recommended Video
చెన్నై: తమిళనాడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవ్వరూ ఊహించనట్లుగా ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జయ టీవీ, నమధు ఎంజీఆర్ దిన పత్రిక కార్యాలయాలతో పాటు శశికళ వర్గంలోని మన్నార్ గుడి మాఫియా ఇళ్లలో సోదాలు ముమ్మరం చేశారు.
ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళ చెన్నైలోని ఆమె మేనకోడలు కృష్ణప్రియ ఇంటిలో ఐదు రోజులు ఉన్న విషయం తెలిసిందే. చెన్నైలోని కృష్ణప్రియ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఊహించని రీతిలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు.
టార్గెట్ శశికళ
జయ టీవీ, నమధు ఎంజీఆర్ దిన పత్రికను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం ఆ మీడియా సంస్థలు శశికళ కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయి. శశికళ మేనల్లుడు వివేక్, టీటీవీ దినకరన్ జయ టీవీ, నమధు ఎంజీఆర్ దిన పత్రికల వ్యవహారాలు చూసుకుంటున్నారు.
అన్నాడీఎంకే ప్రభుత్వం !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటైన తరువాత శశికళ, టీటీవీ దినకరన్ తో పాటు వారి కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయ టీవీ, నమధు ఎంజీఆర్ దిన పత్రిక ప్రచారం చేస్తోంది.
శశికళ ఫ్యామిలీలో ఒక్కరినీ వదల్లేదు !
శశికళ కుటుంబ సభ్యులను ఒక్కరినీ వదిలిపెట్టకుండా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. శశికళ భర్త నటరాజన్, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్, సోదరుడు దివాకరన్, వదిన ఇళవరసి (ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉంది), శశికళ మేనకోడలు కృష్ణప్రియ, టీటీవీ భాస్కరన్, వివేక్ తో పాటు వారి వర్గంలోని నాయకుల ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు జరుగుతున్నాయి.
టీటీవీ దినకరన్ పరుగో పరుగు
శశికళతో భేటీ కావడానికి బుధవారం బెంగళూరు వచ్చిన టీటీవీ దినకరన్ గురువారం ఉదయం ఐటీ శాఖ అధికారులు తన ఇంటిలో సోదాలు చేస్తున్నారని తెలుసుకుని బెంగళూరు నుంచి చైన్నైకి పరుగు తీశారు. శశికళ ముఖ్య అనుచరుడు, కర్ణాటక శాఖ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి (అమ్మ) పుహళేందికి చెందిన మురగేష్ పాళ్యలోని ఇంటిలో, ఆయన కార్యాలయంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మోడీ మీద ఆరోపణలు !
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చెన్నైలో పర్యటించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని పరామర్శించిన విషయం తెలిసిందే. మూడు రోజుల్లోనే చెన్నైతో పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 160 చోట్ల ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రధాని మోడీ కావాలనే ఐటీ అధికారులను రెచ్చగొట్టారని శశికళ వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు.
బీజేపీకి ఏం సంబంధం !
ప్రధాని మోడీ చెన్నై భేటీకి, ఐటీ శాఖ అధికారుల దాడులకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శశికళ కుటుంబ సభ్యులు ఆదాయపన్ను చెల్లించలేదనే ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని తమిళిసై సౌందరరాజన్ క్లారిటీ ఇచ్చారు .
నరేంద్ర మోడీ డౌన్ డౌన్
శశికళ భర్త నటరాజన్ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారం చేస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్ భారీ మొత్తంలో ఆదాయపన్ను ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి. శశికళ భర్త నాటరాజన్, టీటీవీ దినకరన్ తదితర బంధువుల ఇళ్ల ముందు గుమికూడిన చిన్నమ్మ వర్గీయులు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.